ఈఎస్ఐ కుంభకోణం : అరెస్ట్ లతో హడలెత్తిస్తున్న ఏసీబీ .. నిజానిజాల నిగ్గు తేలుతుందా ?
ఏపీలో ఈఎస్ఐ స్కాం సంచలనంగా మారింది. ఈ కుంభకోణంలో ఈ రోజు తెల్లవారుజామున టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఇక ఈ కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చెయ్యనున్న ఏసీబీ అధికారులు తాజాగా ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను తిరుపతి లో , మరో మాజీ డైరెక్టర్ విజయ్ కుమార్ ను రాజమండ్రిలో అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత మందిని ఈ వ్యవహారంలో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కుంభకోణంలో ఏసీబీ స్పీడ్ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
ఈఎస్ఐ రికార్డులు తారుమారు చేసి .. అచ్చెన్నను ఇరికించారు : టీడీపీ నేతల ధ్వజం
ఎనిమిది మంది అధికారుల వాంగ్మూలాన్ని రికార్డు చేసిన విజిలెన్స్ అధికారులు
ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో మందులు,ఇతర వైద్య పరికరాల కొనుగోలు లో భారీ అవకతవకలు జరిగాయని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీలో అరెస్టుల పర్వం మొదలైంది. 2014 2019 మధ్య ఈఎస్ఐ లో భారీగా అక్రమాలు జరిగాయని గుర్తించిన విజిలెన్స్ అధికారులుఈ వ్యవహారంలో ఇప్పటికే ఎనిమిది మంది అధికారుల వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. టెండరింగ్ లేకుండా నామినేషన్ పద్ధతిలో మందులు కొనుగోలు జరిగాయని, ఒక లెటర్ మీద రెండు కంపెనీలకు కూడా అనుమతులు ఇచ్చారని, వాస్తవ ధర కన్నా అదనంగా డబ్బులు చెల్లించాలని గుర్తించారు విజిలెన్స్ అధికారులు.
విజిలెన్స్ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ ..40 మంది పాత్ర ఉన్నట్టు గుర్తింపు
వాస్తవంగా చెల్లించాల్సిన ధర కన్నా అదనంగా 150 కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా, ఇక నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లుగా గుర్తించారు అధికారులు. 16 వేల రూపాయలు విలువ చేసే బయోమెట్రిక్ మిషన్ లను 70 వేలకు కొనుగోలు చేసినట్లుగా గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ కేసులో ఏసీబీ ఎంటర్ అయ్యింది. మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది ఏసీబీ. ఇక కొనుగోళ్ళు టెండరింగ్ లో మాజీ మంత్రి కుమారుడు పాత్ర కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఏపీ ఈఎస్ఐ స్కాంలో 40 మంది పాత్ర ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు అరెస్టులతో హడలెత్తిస్తున్నారు.
ఏసీబీ వేగంతో అధికారులకు , టీడీపీ నేతలకు చెమటలు .. నిజానిజాల నిగ్గు తేలుతుందా ?
ఇక ఈ కేసులో ఏసీబీ వేగం టీడీపీ నేతలకు చెమటలు పట్టిస్తుంది. రాజకీయ కక్ష సాధింపు అని , ఏసీబీ జగన్ ఆదేశాల మేరకు పని చేస్తుందని టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది. ఇక వైసీపీ తప్పు చెయ్యకుంటే భయం ఎందుకు , నిర్దోషులైతే తేలుతుంది కదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి పరాకాష్టకు చేరిందని, అందుకే ఈ విచారణ అని వారు పేర్కొంటున్నారు . ఇది ఇలా ఉంటె ఏసీబీ అధికారులు మాత్రం ఈ కుంభకోణంలో నిజానిజాల నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.