తండ్రి లాంటి వాడిని: కేసీఆర్, బాబులకు గవర్నర్ నర్సింహన్ కీలక సూచనలు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, చంద్రబాబునాయుడులకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ కీలక సూచనలు చేశారు.
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, చంద్రబాబునాయుడులకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ కీలక సూచనలు చేశారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లకు తాను తండ్రిలాంటివాడినని అన్నారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వాలు చేపడుతున్న పథకాల్లో వేగం మరింత పెరగాలని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలు జరగాల్సిన అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు.
ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా నరసింహన్ను ఎన్డీయే ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్న సందర్భంగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సాగు నీటి గొడవను పరిష్కరిస్తానని గవర్నర్ నర్సింహన్ చెప్పారు.
రెండు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. వివాదాస్పదంగా మారిన నాగార్జునసాగర్ గొడవను పరిష్కరిస్తానని గవర్నర్ తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి అన్ని సమస్యలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు.