శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసుకోండి:వైసిపి ఎమ్మెల్యేలకు టిడిపి ఎమ్మెల్యే సలహా
గుంటూరు:వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఒక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవాలని...ఆ అవసరం ఎంతైనా ఉందని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సూచించారు.
పెదకూరపాడు నియోజకవర్గంలోని తాడ్వాయి గ్రామంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవటం దురదృష్టకరమని...ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రతిపక్ష నాయకులు ఒక వేదిక మీదకు రావాలన్నారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకు తిరిగే వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలన్నారు. వాళ్లు రోడ్ల వెంబడి తిరుగుతూ అనవసర వ్యాఖ్యలు చేయటం తగదని కొమ్మాలపాటి హితవు పలికారు.
గ్రామస్ధాయిలో టిడిపి ప్రభుత్వం అనేక సమస్యలు పరిష్కరిస్తూ ముందుకుపోతుందని...గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి దశదిశ నిర్దేశిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం ఎన్నికల కోసం మాత్రమే జనాల దగ్గరకు వస్తున్నారని, ప్రజా సమస్యలపై రావటం లేదని విమర్శించారు.
చంద్రబాబు రైతు రుణవిముక్తి, నదుల అనుసంధానం చేస్తామని అంటే జగన్మోహన్రెడ్డి అసాధ్యమని అన్నారని గుర్తుచేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రెండింటిని చేసి చూపించిందని ఎమ్మెల్యే కొమ్మాలపాటి చెప్పారు. రాబోయే రోజుల్లో ఆరుతడులకు నీళ్ళు ఇస్తామన్నారు. తన నియోజకవర్గం పరిధిలో వైసీపీ నాయకులు చేసిన రాద్ధాంతం వల్ల కస్తల గ్రామంలో సుమారు 2 వేల మంది ఇసుక కార్మికులు రోడ్డున పడ్డారని, ఇసుక రేట్లు కూడా పెరిగాయని చెప్పుకొచ్చారు.
Recommended Video
వైసీపీకి అధికారం ఒక కలగానే మిగిలిపోతుందని ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఎద్దేవా చేశారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా అభివర్ణించారు. ఇకనైనా ప్రతిపక్ష నాయకులు కళ్ళు తెరవాలని అన్నారు.