Kadapa: కడపలో ఎల్వీ ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి..పరిశోధన కేంద్రం: హైదరాబాద్ కు మించి..!
కడప: ఎల్వీ ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఈ ఆసుపత్రి సేవలు ఇక ఏపీలో కూడా ఆరంభం కానున్నాయి. విభజన తరువాత ఏపీలో తమ కార్యకలాపాలను చేపట్టడానికి ఎల్వీ ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఇన్ స్టిట్యూట్ యాజమాన్యం సన్నాహాలు పూర్తి చేసింది. ఏపీలో తమ కార్యకలాపాలను ఆరంభించడానికి తొలి అడుగుగా కడపను ఎంచుకుంది.
ఏపీలో తొలిసారిగా ఎల్వీ ప్రసాద్ కంటి చికిత్స.. పరిశోధన
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండకపోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో 1987లోనే ఈ ఆసుపత్రి ఏర్పాటైంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించింది. కంటి చికిత్స, పరిశోధనలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి కార్యకలాపాలు తెలంగాణకు పరిమితం అయ్యాయి. కంటి చికిత్స, పరిశోధనా రంగంలో ఎల్వీ ప్రసాద్ స్థాయిలో మరో ఆసుపత్రి ఏపీలో ఇంతవరకూ ఏర్పాటు కాలేదు.
పాలనాపరమైన అనుమతులు మంజూరు..
ఈ లోటును భర్తీ చేయడానికి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి యాజమాన్యం సన్నాహాలు చేపట్టింది. ఏపీలో కూడా కార్యకలాపాలను విస్తరించుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. కడపలో అత్యాధునికమైన కంటి ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. ఈ ప్రతిపాదనలపై ఏపీ ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది.
కడప శివార్లలో స్థలం..
పాలనాపరమైన అనుమతులను జారీ చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ లోని పంజగుట్టలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆసుపత్రిని మించిన స్థాయిలో అత్యాధునిక వసతులతో కొత్తగా ఈ కంటి చికిత్స, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఏపీ ప్రభుత్వంతో ఓ పరస్పర అంగీకార ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. కడప శివార్లలో స్థలాన్ని కేటాయించే అవకాశాలు ఉన్నాయి.