చంద్రభానుని చూస్తే కోపం రాలేదు: అనూహ్య తండ్రి, ఆ రోజేం జరిగింది?
ముంబై/మచిలీపట్నం: బందర్ టెక్కీ అనూహ్య హత్య కేసులో చంద్రభానుకు ముంబై స్పెషల్ సెషన్స్ న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేయడంపై అనూహ్య తండ్రి ప్రసాద్ స్పందించారు. ఈ తీర్పు తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు.
నా బిడ్డను కోల్పోయానని, తన కూతురు ఎలాగు తిరిగి రాదని కానీ దోషికి ఉరిశిక్ష సంతోషాన్నిచ్చిందన్నారు. మగ మృగాలకు ఇలాంటి కఠిన శిక్షలు అవసరమన్నారు. ఇదే శిక్ష పడుతుందని తాను మొదటి నుంచి భావించానని చెప్పారు.
తనతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ మొదటి నుంచి ఇదే శిక్షను కోరుకుంటున్నారని, తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు. తాను ముంబైలో చంద్రభానును తొలిసారి చూసినప్పుడు.. అతను ధీమాగా ఉన్నాడని చెప్పారు. తాను చూసినప్పుడు అతనికి అనూహ్య తండ్రిని అనే విషయం తెలియదన్నారు.
అతనిలో నేరం చేశాననే భయం కనిపించలేదన్నారు. అతనిని చూస్తే తనకు కోపం రాలేదని చెప్పారు. దోషి చంద్రభాను న్యాయవాది పైకోర్టుకు వెళ్తానని చెబుతున్నారని అనూహ్య తండ్రిని ప్రశ్నించగా... అక్కడా ఇదే తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రభాను అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేశాడని కోర్టు నిర్ధారించింది.
ఆ రోజేం జరిగింది?
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య ముంబైలోని అంధేరి పరిసరాల్లో ఉన్న టిసిఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేసేది. 2013 డిసెంబరులో క్రిస్మస్ సెలవులకు మచిలీపట్నం వెళ్లింది. సెలవుల అనంతరం 2014, జనవరి 4న విజయవాడలో లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో ముంబైకి తిరుగు ప్రయాణమయింది.
కుమార్తెను రైలు ఎక్కించిన తండ్రి సురేంద్రప్రసాద్ ఆ రోజు అర్ధరాత్రి అనూహ్యతో మాట్లాడారు. ఆ సమయంలో సెల్ఫోన్ ఛార్జింగ్ లేదని ముంబై చేరుకున్న తర్వాత ఫోను చేస్తానని చెప్పింది. అనంతరం అనూహ్య నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
నిర్మానుష్యంగా ఉండే కంజూర్మార్గ్, బాండూప్ ప్రాంతంలో జనవరి 16న సగం కాలిపోయిన మృతదేహం కనిపించింది. సమీపంలో దొరికిన ఆనవాళ్లను బట్టి ఆ మృతదేహం అనూహ్యదిగా నిర్ధరించారు.
జనవరి 5 ఉదయం 4 గంటల ప్రాంతంలో చంద్రభాన్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో లోక్మాన్య తిలక్ టర్మీనస్ (ఎల్టీటీ) రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ అనూహ్యను గమనించాడు. ట్యాక్సీ డ్రైవర్గా చెప్పి, రూ.300కే అంధేరిలోని హాస్టల్ గది వద్ద విడిచిపెడతానని నమ్మించాడు.
ట్యాక్సీలో కాకుండా బలవంతంగా బెదిరించి మోటార్ సైకిల్ పైన ఎక్కించుకున్నాడు. కంజూర్మార్గ్ మీదుగా తాను నివాసం ఉంటున్న కార్వే నగర్కు రెండు కి.మీ దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఘోరానికి ఒడిగట్టాడు.
ప్రాణాలతో విడిచిపెట్టాలని, అందుకు రూ.రెండు లక్షలు ఇస్తానని అనూహ్య ప్రాధేయపడినప్పటికీ చంద్రభాన్ మనసు కరగలేదు. ఈ విషయాన్ని అతనే పోలీసుల విచారణలో వెల్లడించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత అనూహ్య ఎదురు తిరగడంతో తొలుత చెంపదెబ్బ కొట్టాడు.
దీంతో ఆమె తన వద్ద అప్పటికి ఉన్న నగదు మొత్తం ఇచ్చేస్తానని, విడిచి పెట్టాలని కోరింది. ఆ తర్వాత రూ.ఒకటి, రెండు లక్షలు సర్దుబాటు చేస్తానంది. అయినా కనికరం చూపని చంద్రభాన్.. అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడి, గొంతు నులిమి చంపేశాడు.
అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనూహ్యను ఎక్కించుకుని తీసుకెళ్లిన మోటారు సైకిల్ చంద్రభాన్ స్నేహితుడు చంద్రశేఖర్ సాహుది. అత్యాచారం, హత్య గురించి అతనికి చంద్రభాన్ చెప్పేశాడు. అనూహ్య దుస్తులు, కళ్లద్దాలు, హ్యాండ్ బ్యాగ్ను చంద్రభాన్ తన చెల్లెలి వద్ద ఉంచి అక్కడ్నుంచి నాసిక్కు పారిపోయాడు.
క్రైం బ్రాంచ్ పోలీసులు ఎల్టీటీ రైల్వేస్టేషన్, ఆయా పరిసరాల్లో ఉన్న 36 సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను క్షుణ్నంగా పరిశీలించారు. తొమ్మిది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. కార్వేలో నివాసముంటున్న తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చిన చంద్రభాన్ను రెండు నెలల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు.