ఎపిఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో...ఈయూ కూటమి ఘనవిజయం
విజయవాడ:ఏపీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కూటమి ఘనవిజయం సాధించింది. ప్రధానంగా ఎంప్లాయీస్ యూనియన్ కూటమి, ఎన్.ఎం.యూల మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరకు ఈయూనే విజయం వరించింది.
రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ ఎన్నికల్లో కొత్త కార్యవర్గాల ఎన్నిక ఉత్కంఠ వాతావరణం నడుమ ప్రశాంతంగా జరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోల్లో ఎన్నికలు జరగగా...మొత్తం 50,211 సిబ్బంది ఓట్లకు గానూ 84,822 ఓట్లు పోలయ్యాయి. అందులో ఎంప్లాయీస్ యూనియన్ కు 25వేల 541 ఓట్లు...ఎన్.ఎం.యు.కు 23వేల 281 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈయూ 2, 260 ఓట్ల అధిక్యంతో విజయభేరి మోగించింది. అయితే అధికారిక ఫలితాలను ఈ నెల 14న ప్రకటిస్తారు.
ఎపిఎస్ ఆర్టీసీలో ఇంతవరకు గుర్తింపు సంఘంగా ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్ కు సిబ్బంది షాకిచ్చారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసం గురువారం రాష్ట్రంలోని వివిధ డిపోల్లో జరిగిన ఎన్నికల్లో ఈయూ కూటమి గెలుపొందింది. మెజారిటీ సభ్యుల సంఖ్యను ఆధారం చేసుకొని గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న పెద్ద యూనియన్ ఎన్ఎంయూ ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది.
మరోవైపు ఎలాగైనా ఎన్ఎంయూని చిత్తు చేయాలని పట్టుదలతో ఉన్న ఎంప్లాయిస్ యూనియన్ కు అనేక ఆర్టీసీ కార్మిక సంఘాల తోడయ్యాయి. ఫలితంగా ఈ ఎన్నికల్లో ఎన్నడూలేని విధంగా ఈసారి కొత్త పొత్తులు కనిపించాయి. ఎన్ఎంయూని మట్టికరిపించేందుకు తొలిసారిగా ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, వైసీపీ అనుబంధ కార్మిక సంఘాలు సైతం ఏకమై ఎంప్లాయీస్ యూనియన్ కు మద్దతు ఇచ్చాయి. దీంతో అనుకున్నట్లుగానే ఈయూ విజేతగా నిలిచింది.
ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా తేలాల్సి ఉన్నందున అవి పూర్తయిన తరువాతే తుది ఫలితాలు వెలువడతాయి. ఈసారి ఎన్నికల్లో డిపోల వారిగా చూసినా అనేక చోట్ల ఈయూకే స్పష్టమైన ఆధిక్యం దక్కడం గమనార్హం. ఫలితాల్లో అధిక్యంతో ఈయూ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. తమపై కార్మికుల్లో నమ్మకం పెరిగినందునే విజయం సాధ్యమైందని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక డిపోల వారిగా చూస్తే నెల్లూరు రీజియన్ను ఎస్డబ్ల్యూఎఫ్, ఒంగోలు రీజియన్తోపాటు హెడ్ ఆఫీస్ ను కార్మిక పరిషత్ (వరహాలునాయుడు వర్గం) గెలుచుకోగా... ఇదే కూటమిలో చేరి బరిలోకి దిగిన వైఎస్ ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ కడప రీజియన్లో గెలవగా పులివెందులలో ఎన్ఎంయూపై ఓటమిపాలయింది. అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, తూర్పుగోదావరి, ఎన్ఈసీ రీజియన్లలో ఈయూ కూటమి విజయం సాధించగా...విశాఖపట్నం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎన్ఎంయూ విజయం సాధించింది. ప్రకాశం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్తో కార్మిక పరిషత్ విజయం సాధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
గుంటూరు ఫలితం రావాల్సి వుండగా ఇక్కడకూడా ఈయూనే గెలుస్తుందని భావిస్తున్నారు. గతంలో ఈయూ 27 శాతం ఐఆర్, 43 శాతం ఫిట్మెంట్ సాధించింది. అదే ఎన్ఎంయూ 19 శాతం ఐఆర్ సాధించి తెలంగాణతో పోలిస్తే ఎక్కువగా సాధించామని చెప్పుకుంది. దీనినే ఆయుధంగా మలచుకున్న ఈయూ కూటమి...తమను ఎన్నుకుంటే 54 శాతం ఫిట్మెంట్ సాధిస్తామని, అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తామని కార్మికులకు పెద్ద హామీ ఇచ్చింది.అయినా ఆర్టీసీ సిబ్బంది ఈయూపైనే విశ్వాసం ఉంచారు.