ఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమి తప్పదు, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు?
అమరావతి/న్యూఢిల్లీ: ఇండియా టుడే - కార్వీ ఇన్సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో హంగ్ వస్తుందని, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, అదే సమయంలో బీజేపీకి భారీ దెబ్బ తగులుతుందని ఈ సర్వేలో వెల్లడైంది. కొత్తగా ఎన్డీయేలోకి వచ్చే మిత్రులు కూడా ఎన్డీయేను గట్టెక్కించలేరని తేలింది.
ఏపీబీ-సీ ఓటరు సర్వే: యూపీలో బీజేపీకి 25, ఎస్పీ-బీఎస్పీలకు 51 సీట్లు, ప్రియాంకగాంధీ రాకతో...
కేసీఆర్, జగన్లు గెలిచినా కాపాడలేరా?
దక్షిణాది విషయానికి వస్తే తమిళనాడులో అన్నాడీఎంకే, ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీకి అండగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ యాంగిల్లోను మూడ్ ఆఫ్ ది నేషన్ ఫలితాలు వెల్లడించారు.
వీరు ఒక్కటైతే విపక్షాలదే అధికారం
ఏపీలో వైయస్ జగన్కు, తెలంగాణలో కేసీఆర్కు, తమిళనాడులో అన్నాడీఎంకేకు ఎక్కువ లోకసభ సీట్లు వచ్చినప్పటికీ కూడా బీజేపీని గట్టెక్కించలేరని ఈ సర్వేలో వెల్లడైందని చెబుతున్నారు. మాయావతి, మమతా బెనర్జీ, మహబూబా ముఫ్తీ, అఖిలేష్ యాదవ్లు కాంగ్రెస్ పార్టీకి జత కలిస్తే మాత్రం వారిదే అధికారమని ఈ సర్వేలో వెల్లడైంది.
వైసీపీ, అన్నాడీఎంకే కలిసినా 234 సీట్లు
అన్నాడీఎంకే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలిసినప్పటికీ ఎన్డీయే 234 లోకసభ సీట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వేలో వెల్లడైంది. మేజిక్ ఫిగర్ 272. ఈ సర్వే ప్రకారం.. కాంగ్రెస్కు మాయావతి, మమతా బెనర్జీ, ముఫ్తీ, అఖిలేష్ యాదవ్ తదితరులు కలిస్తే వారికి 272 సీట్ల వరకు వచ్చే అవకాశముందని తేలింది. ఓటు షేర్ విషయానికి వస్తే విపక్షాలకు 44 శాతం, ఎన్డీయేకు 40 శాతం రానుంది.
సీట్లు తక్కువ పడనున్నాయి
తెలంగాణ రాష్ట్ర సమితి వంటి మరికొన్ని పార్టీలు కలిసినప్పటికీ ఎన్డీయేకు 257 సీట్లు వస్తాయని తేలింది. కొత్త మిత్రులు దాదాపు 59 స్థానాల్లో గెలుస్తారని ఈ సర్వేలో తేలింది. అంటే టీఆర్ఎస్, అన్నాడీఎంకే, వైయస్సార్ కాంగ్రెస్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీలు పార్టీలు ఆ స్థానాల్లో గెలుస్తారు. వారు మద్దతిచ్చినప్పటికీ మరో పదిహేను సీట్లు ఎన్డీయేకు తక్కువ పడనున్నాయి.
వీరంతా కలిస్తే బీజేపీకి చుక్కలే
రాహుల్ గాంధీకి మాయావతి, మమతా బెనర్జీ, ముఫ్తీ, అఖిలేష్ యాదవ్ వంటి వారు కలిస్తే మహాకూటమికి 296 సీట్లు, బీజేపీకి 219 సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది. ఇతరులకు 55 సీట్లు రానున్నాయి. ఓట్ షేర్ ఎన్డీయేకు 35 శాతం, యూపీఏకు 44 శాతం ఓట్లు రానున్నాయి. ఇతరులకు 21 శాతం ఓట్లు రానున్నాయి.