కేసులు పెట్టినా సరే: చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటానన్న కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబుపై, టిడిపి నేతలపై నిత్యం విమర్శల వర్షం కురిపిస్తూ, తిట్లదండకం అందుకునే ఏపీ మంత్రి కొడాలి నాని తీరుపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు కొడాలి నాని పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని పై పోలీసులు చర్యలు తీసుకోకుంటే గవర్నర్ ను కలవడానికి కూడా వెనకాడమని టిడిపి నేతలు తేల్చి చెబుతున్నారు. కొడాలి నానీ వ్యాఖ్యలు, బెదిరింపుల విషయంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలిశారు టీడీపీ నేతలు వర్ల రామయ్య , అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు.
మంత్రి కొడాలి నాని వాడుతున్న భాష అప్రజాస్వామికమని, అంతేకాదు బెదిరింపు వ్యాఖ్యలు తరచుగా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. కొడాలి నానీ బెదిరింపు వ్యాఖ్యలతో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, తాజా పరిణామాలపై కొడాలి నాని స్పందించారు.
నేడు గుడివాడలో పర్యటించిన కొడాలి నాని ఎవరు ఎన్ని కేసులు వేసినా లెక్క చేసేది లేదని తేల్చి చెప్పారు.తెలుగుదేశం పార్టీలో పని పాట లేని వాళ్ళు తనపై ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఎంత మంది వ్యతిరేకంగా మాట్లాడినా సరే చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటానంటూ కొడాలి నాని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు అందించాలనే సదుద్దేశంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయానికి టిడిపి అడుగడుగునా ఇబ్బందులు కలిగిస్తుందని ఆయన మండిపడ్డారు. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరెన్ని కేసులు పెట్టినా వాటిని పరిష్కరించుకుని రిజిస్ట్రేషన్ చేసి మరీ మహిళలకు ఇళ్లస్థలాలు అందిస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు.
మొన్నటికి మొన్న పేదలకు ఇళ్ళ స్థలాలు వద్దన్న అమరావతి ప్రాంతానికి శాసన రాజధాని కూడా అవసరం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళామని, ఆయన ఆలోచిద్దాం అన్నారని కొడాలి నానీ అన్నారు . ఆ తర్వాత కూడా అయన చంద్రబాబును పరుష పదజాలంతో దూషించారు.