ఊరిస్తూ ఉసూరుమనిపిస్తున్న డిఎస్సీ...మరోసారి వాయిదా:అంతా అయోమయం!
Recommended Video
అమరావతి:ఎపి డీఎస్సీపై సందిగ్థం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 6 వ తేదీనే నోటిఫికేషన్ అంటూ నిరుద్యోగులకు నమ్మబలికిన రాష్ట్ర ప్రభుత్వం దానిని మరోసారి వాయిదా వేసింది.
దీంతో ఈ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగార్థులు మళ్లీ మళ్లీ వాయిదాతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇలా వరుస వాయిదాల కారణంగా వారిలో ఈ ఉద్యోగాల నియామకంపై ఆందోళన నెలకొంది. కారణం తొలుత ప్రకటించిన ఉద్యోగాల సంఖ్యలో భారీగా కోతపడటం, జిల్లాల వారీగా వేకెన్సీల సంఖ్య ఇంకా తేలకపోవడం తదిదర కారణాలతో డిఎస్సీపై డైలమా నెలకొంది.
డిఎస్సీ...ఊరిస్తోంది...
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగార్థులను ఊరించి ఉసూరుమనిపిస్తున్నాయి. త్వరలో నోటిఫిషన్...ఇదిగో నోటిఫికేషన్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అందుకోసమేనంటూ ఇప్పటికే ప్రభుత్వం ఒకటికి రెండు స్లారు టెట్ పరీక్ష్ సైతం నిర్వహించింది. దీంతో వేలాది మంది ఆశావాహులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. జులై 6న నోటిఫికేషన్ అంటూ మంత్రి ఆర్భాటంగా ప్రకటించినా నేటికి నోటిఫికేషన్ జాడలేదు. మరోవైపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేస్తామని తొలుత చెప్పిన విద్యాశాఖ ఆ తర్వాత ఆర్థికశాఖ నుంచి స్పష్టత రాలేదని, ఇతర కారణాలు సాకుగా చూపుతూ డిఎస్సీని వాయిదా వేసింది.
గెజిట్ విడుదల...అంతా గందరగోళం
డిఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆవగా ఎదురుచూస్తున్న క్రమంలో జులై నెల 3న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గెజిట్ నోటిఫికేషన్ 246 విడుదల చేసింది. దీంతో మరో కొత్త సమస్య ఉత్పన్నమైంది. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలవుతుందని భావిస్తున్న నేపథ్యంలో గెజిట్ నోటిపికేషన్ విడుదల కావడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు బిఈడి వారికి ఎస్జీటీ అవకాశం కల్పించడంతో డీఎడ్ వారు కోర్టు మెట్లు ఎక్కినట్లు తెలుస్తోంది. మరోవైపు పోస్టుల ఖాళీల ప్రకటనపై కూడా నేటికి స్పష్టత లేదు.
మంత్రి కూడా...చెప్పలేకపోతున్నారు...
ఈ నేపథ్యంలో సెంట్రల్ వర్సిటీ ప్రారంభానికి వచ్చిన విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఖాళీల ప్రకటనపైనా, నోటిఫికేషన్ పైనా స్పష్టమైన హామీ ఇవ్వలేక పోయారు. దీంతో టీచర్ పోస్టుల ఆశావహుల్లో, నిరుద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. డిఎస్సీ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ నెలలో టెట్ నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గత నెలాఖరులో స్పష్టత వస్తుందని అందరూ భావించగా అలా జరగలేదు. జులై నెలాఖరులో కేబినెట్ సమావేశం జరగగా ఆ సమావేశంలో సుమారు 20 వేల వరకూ ఉద్యోగాలు భర్తీకి సూచనప్రాయంగా ఆమోదం తెలిపారు.
దయచేసి...విడుదల చేయండి
అయితే ఈ 20 వేల ఉద్యోగాల్లో సుమారు 9 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్రంలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు...? జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య ఎంత?...నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది..? వంటి ప్రశ్నలకు నేటికీ సమాధానాలు లభించడం లేదు. ఇప్పటికే డిఎస్సీలో మరో 1000 పోస్టులు తగ్గుతాయని తెలిసి డీలా పడిన అభ్యర్థులు నోటిఫికేషన్ అంతకంతకూ వెనక్కు పోతుండటంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకముందే నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని లక్షలాదిమంది అభ్యర్థులు కోరుతున్నారు.