విశాఖలో భారీ ల్యాండ్ పూలింగ్కు రంగం సిద్దం.. తహశీల్దార్ కార్యాలయాల్లో అధికారుల హడావుడి..
విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నేపథ్యంలో భారీ ల్యాండ్ పూలింగ్కు ప్రభుత్వం సిద్దమైంది. విశాఖ చుట్టుపక్కల 10 గ్రామాల్లో 6వేల ఎకరాల సేకరణకు జీవో.72 జారీ చేసింది. జీవో ప్రకారం సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమిలి, అనకాపల్లి, విశాఖ రూరల్, పెద గంట్యాడ, ఆనందపురం ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు. దీంతో ఆ మండలాల పరిధిలోని తహశీల్దార్ కార్యాలయాల్లో ఇప్పటికే అధికారుల హడావుడి మొదలైంది.
ల్యాండ్ పూలింగ్ కింద సేకరించే భూములను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(VMRDA)కి అప్పగించనున్నారు. ఆ స్థలాల్లో వీఎంఆర్డీఏ ప్లాట్లను అభివృద్ది చేసి ఇవ్వనుంది. ఇల్లు లేని పేదలందరికీ గృహాలు నిర్మించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేపట్టినట్టు చెబుతున్నారు. అలాగే విశాఖలో ప్రభుత్వ భూములను ఆక్రమించినవారిని ఖాళీ చేయించి.. వీఎంఆర్డీఏ అభివృద్ది చేసే ప్లాట్లను వారికి కేటాయించనున్నట్టు సమాచారం.
ల్యాండ్ పూలింగ్ విధి విధానాలు..
ల్యాండ్ పూలింగ్లో భాగంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములనే సమీకరించనున్నారు. అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారికి పరిహారం చెల్లించనున్నారు.ఎకరా అసైన్డ్ భూమికి 900 గజాల అభివృద్ది చేసిన ప్లాట్లను తిరిగి ఇస్తారు. అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమించి పదేళ్లకు పైగా అక్కడ నివాసం ఉంటున్నవారికి ఎకరానికి 450 గజాల అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వనున్నారు. ఐదేళ్లు పైబడి నివసిస్తున్నవారికైతే ఎకరానికి 250 గజాల అభివృద్ది చేసిన భూమిని ఇవ్వనున్నారు.
నిరుపయోగంగా ఉన్నవాటిని స్వాధీనం చేసుకునేందుకు..
రాష్ట్రంలో ఉగాది నాటికి ఇళ్లు లేని పేదలు ఉండరాదన్న ఉద్దేశంతో ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. ఉగాది పర్వదినాన 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల ఇవ్వాలనుకుంటోంది. ఇందుకోసం ప్రభుత్వ భూములతో పాటు ఇతర ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తోంది. గత ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు కేటాయించిన భూములపై సమీక్ష జరుపుతోంది. వాటిలో నిరూపయోగంగా ఉన్నవాటిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోనున్నారు. అలాగే ప్రభుత్వ భూములను కబ్జా చేసినవారి నుంచి కూడా ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు.
వ్యతిరేకిస్తోన్న సీపీఎం..
ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను సీపీఎం నేత మధు వ్యతిరేకించారు. పేదల భూములు లాక్కునేందుకే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేస్తోందని ఆరోపించారు. గతంలో అమరావతిలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్ను తాము వ్యతిరేకించామని, ఇప్పుడు విశాఖలో చేపట్టబోయే ల్యాండ్ పూలింగ్ను కూడా వ్యతిరేకిస్తామని చెప్పారు. ఇది పూర్తిగా రైతాంగాన్ని కష్టాల్లోకి,పేదరికంలోకి నెట్టేసే చర్య అన్నారు. ఒకవేళ ప్రభుత్వం భూసేకరణ జరపాలనుకుంటే.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించాలని డిమాండ్ చేశారు. అంతే తప్ప ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులు,పేదలను కష్టాల్లోకి నెట్టవద్దన్నారు. 151 సీట్లు వచ్చాయని,ఇష్టారీతిన వ్యవహరించవద్దని అన్నారు.
హౌజింగ్ కోసమేనా.. లేక..
అర్బన్ హౌజింగ్ కోసమే ల్యాండ్ పూలింగ్ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ప్రభుత్వం సేకరించే భూముల్లో కొన్ని ప్రాజెక్టులు కూడా ఏర్పాటు కావచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే అధికారులు ఆయా మండలాల పరిధిలో అసైన్డ్,ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో పడ్డారు. త్వరలోనే ల్యాండ్ పూలింగ్ను పూర్తి చేసే అవకాశం ఉంది.