ఈవిఎంలో సాంకేతికలోపం: కల్వకుర్తి ఫలితానికి బ్రేక్
ఆ తర్వాత జరిగిన ఓట్ల లెక్కింపులో టిఆర్ఎస్ అభ్యర్థి రెండవ స్థానం నుండి మూడు, నాలుగు స్థానాలకు దిగజారడంతో బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి రెండవ స్థానంలోకి వచ్చారు. మొత్తం 34 రౌండ్ల ఓట్ల లెక్కింపు చేశారు. 25-32 రౌండ్ల వరకు వంశీచంద్కంటే ఆచారి ముందంజలో ఉన్నారు. 33, 34 రౌండ్లలో ఆచారికి 42197 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి 42289 ఓట్లు వచ్చాయి. 32 ఓట్లతో పాటు 125 పోస్టల్ బ్యాలెట్లతో 157 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు.
కాగా ఓట్ల లెక్కింపులో వెల్దండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన 119వ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ఫలితం పూర్తి చూయించకుండా ముందుగా మొరాయించడంతో 34 రౌండ్లు ముగిసిన తర్వాత తిరిగి అధికారులు లెక్కించారు. ఈ యంత్రంలో 727 ఓట్లు పోల్ కాగా, కేవలం బిజెపికి 17, బిఎస్పీకి 1, టిఆర్ఎస్ 33, కాంగ్రెస్ 18, వైయస్సార్ కాంగ్రెస్ 22, స్వతంత్ర అభ్యర్థికి 3 చొప్పున 119 ఓట్లు మాత్రమే చూయించడంతో ఫలితాన్ని నిలిపివేశారు. అధికారులు ఈవిఎం నిపుణులను తీసుకొచ్చి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
సాయంత్రం 3 గంటల పాటు మొరాయించిన ఈవిఎంను బాగు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ శర్మన్, రిటర్నింగ్ అధికారి అమరేందర్ రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి మొరాయించిన ఈవిఎంను సీజ్ చేసి తాత్కాలికంగా ఫలితాన్ని నిలిపివేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంపించారు. ఈ సాంకేతిక లోపం నిపుణుల ద్వారా సరిదిద్దగలిగితే కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తామని, ఒక వేళ ఈవిఎం పని చేయకుంటే ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే.. ఆ మేరకు రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ గిరిజా శంకర్ తెలిపారు.