ఈసీ రమేశ్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు, జగన్ కామెంట్లపై ఐవైఆర్ అభ్యంతరం..
ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని, ఎన్నికల కమిషనర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదని మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. ఈసీ రమేశ్ కుమార్పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు సరికాదని సూచించారు. ఈ మేరకు ఐవైఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 151 సీట్లు వచ్చినా.. 175 సీట్లు వచ్చినా రాజ్యాంగ బద్దంగా నడిచే సంస్థపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రికి కూడా పరిమితులు ఉంటాయని ఐవైఆర్ సూచించారు. ఈ విషయం సీఎం జగన్ గమనిస్తే మంచిదని హితవు పలికారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగినంత సేపు ఇండ్ల స్థలాల పంపిణీ అంశాలను నిలిపివేసే పూర్తి అధికారం.. ఎన్నికల సంఘానికి ఉందని గుర్తుచేశారు. సరైన కారణంతో ఎన్నికలను వాయిదావేసే అధికారం కూడా ఈసీకి ఉందని వివరించారు. రాజ్యాంగ బద్ద సంస్థలపై ఆరోపణలు చేసేముందు ఆలోచించి కామెంట్ చేయాలని సూచించారు.
ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఈసీ చెప్పడంపై ఐవైఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడు, నాలుగు నెలల వరకు ఎన్నికలు జరగకుంటే ప్రభుత్వ సుప్తచేతనావస్థలో ఉండటం సరికాదని అభిప్రాయపడ్డారు. కోడ్ను వెనక్కి తీసుకొని.. తిరిగి ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తే బాగుండేదని సూచించారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వాయిదావేయడంతో వివాదం రాజుకుంది. వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించారు. అధికార పార్టీ నేతలు రమేశ్ కుమార్.. చంద్రబాబు చెప్పినట్టు నడుచుకొంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. వైరస్ ప్రబలుతుంటే ఎన్నికలు ముఖ్యమా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు.. అధికార వైసీపీ నేతల తీరును తప్పుపట్టారు.