చేతకాకపోతే ఆ పని చేయండి: కావాలంటే ప్రజంటేషన్ ఇస్తా: జగన్ సర్కార్కు సీబీఐ మాజీ చీఫ్ సలహా
అమరావతి: రాష్ట్రంలో వరుసగా కొనసాగుతోన్న దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఉదంతంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎం నాగేశ్వర రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యథేచ్ఛగా దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నప్పటికీ.. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నప్పటికీ.. దాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో వేలాది ఆలయాలను తన ఆధీనంలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. మసీదులు, చర్చ్లను ఎందుకు వదిలేసిందని ప్రశ్నించారు.
Recommended Video
రాష్ట్రంలో హిందూ ధర్మంపై విపరీతమైన దాడులు కొనసాగుతున్నాయని ఎం నాగేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ధర్మం లేకపోతే.. భారత దేశమే ఉండదని, తన మనుగడను కోల్పోతుందని అన్నారు. హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందువు ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మం లేకపోతే.. భారత్ ఓ క్రైస్తవ దేశంగా లేదా ముస్లిం దేశంగా ఏర్పడుతుందని నాగేశ్వర రావు చెప్పారు. భారత్ అనే పేరులోనే హిందూ ధర్మం ఉందని గుర్తు చేశారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒక్కప్పుడు భారత్లోనే ఉండేవని, ఇప్పుడు వాటిని ముస్లిం దేశాలుగా గుర్తిస్తున్నారని చెప్పారు. అదే తరహాలో హిందూ ధర్మం అనేది లేకపోతే.. భారత్ కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్లాగా తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. రాష్ట్రంలో 24,846 దేవాలయాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వ ఆజమాయిషీ కొనసాగుతోందని నాగేశ్వర రావు చెప్పారు. అదే తరహాలో మసీదులు, చర్చీలను ప్రభుత్వం ఎందుకు తన ఆధీనంలోకి తీసుకోలేకపోతోందని ప్రశ్నించారు.
హిందూ దేవాలయాలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లే ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికే అప్పగించాలని డిమాండ్ చేశారు. గురుద్వారాలను సిక్కులు సొంతంగా నిర్వహించుకుంటున్నారని, అదే తరహాలో దేవాలయాలను కూడా హిందూ సమాజానికే అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆసక్తి ఉంటే.. తనకు కబురు పెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
హిందూ సమాజానికి ఆలయాలను బదలాయించడంపై తాను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తానని చెప్పారు. దీనిపై ఆయన ట్వీట్ చేయగా.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి బదులు ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. నైతికత అప్పుడేమైందని ప్రశ్నించారు. దీనికి నాగేశ్వర రావు బదులిస్తూ తాను గత ఏడాది జులైలో పదవీ విరమణ చేశానని చెప్పారు.