కేంద్ర సర్వీసులకు ఎల్వీ సుబ్రమణ్యం..! సీఎం జగన్ అంగీకరించకుంటే..ఆ మార్గంలో: ఢిల్లీలో లైన్ క్లియర్..!
ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహనికి గురై..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి లో కొనసాగుతూ వేటుకు గురైన ఎల్వీ సుబ్రమణ్యం కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతర్ చేసారనే కారణంతో ప్రభుత్వం అనూహ్యంగా ఆయనపైన బదిలీ వేటు వేసింది. రాష్ట్ర చరిత్రలో సీఎస్ గా ఉన్న అధికారిని బదిలీ చేయటం దాదాపు ఇదే తొలి సారి. ఆ వెంటనే ఎల్వీ తనకు కేటాయించిన విధుల్లో చేరకుండా.. నెల రోజుల పాటు సెలవులో వెళ్లారు. ఢిల్లీలో తన సన్నిహితుల ద్వారా ప్రయత్నాలు చేసారు.
కేంద్ర సర్వీసుల్లో స్థానం దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు ఎల్వీని రాష్ట్రం నుండి రిలీవ్ చేయాలంటూ కేంద్రం నుండి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఏపీ ప్రభుత్వం అందుకు అంగీకరించకపోయినా..అడ్డుపడినా.. మరో మార్గంతో ఎల్వీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఎల్వీ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
కేంద్ర సర్వీసులకు ఎల్వీ..
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునీఠాను బదిలీ చేసిన ఎన్నికల సంఘం..ఎల్వీ సుబ్రమణ్యంను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఆ నిర్ణయం సంచలనంగా మారింది. ఇక, ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత పూర్తి కాలం సీఎస్ గా నియమిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.
సీఎం..సీఎస్ మధ్య సన్నిహిత సంబంధాలే కొనసాగాయి. కానీ, ప్రవీణ్ ప్రకాశ్ ముఖ్యమంత్రి కార్యదర్శిగా వచ్చిన తరువాత..ఆయన సర్వీసు రూల్స్ ను వ్యతిరేకించారంటూ సీఎస్ హోదాలో సంజాయిషీ నోటీసులు జారీ చేసారు. దీంతో..ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో ముఖ్యమంత్రి ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సాహ్నిని ఏపీకి తీసుకొచ్చి..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దీంతో..సెలవు పై వెళ్లిన ఎల్వీ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించారు.
సహకరించిన ఢిల్లీ పెద్దలు..
ఎల్వీ సుబ్రమణ్యం తనపైన బదిలీ వేటు పడగానే..సెలవు పై వెళ్లారు. ఢిల్లీలో తన సన్నిహితుల ద్వారా కేంద్ర సర్వీసులకు వెళ్లేలా ప్రయత్నాలు చేసారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వంలోకి కొందరు సహకారం అందించినట్లుగా ప్రచారం సాగింది. ఒక దశలో ఆయన్ను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో లేదా..పోలవరం కేంద్ర సమన్వయకర్తగా నియమిస్తారనే ప్రచారం సైతం సాగింది.
వచ్చే మార్చి వరకు ఎల్వీకి సర్వీసు ఉంది. తాను ఏపీలో కొనసాగలేనని..తనకు కేంద్ర సర్వీసుల్లో పని చేసే అవకాశం కల్పించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శిని కలిసి ఎల్వీ అభ్యర్ధించినట్లుగా సమాచారం. దీంతో.. కొందరు పెద్దల సహకారంతో ఆయన కోరుకున్న విధంగా కేంద్ర సర్వీసులకు ఎల్వీని తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సమాచారం. దీని పైన ఏపీ ప్రభుత్వానికి సైతం కేంద్రం నుండి సమాచారం వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎల్వీని రిలీవ్ చేసే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది.
ప్రభుత్వం అంగీకరించుకున్నా..ఆ మార్గంలో
ఎల్వీ సుబ్రమణ్యం ను కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే.. మరో మార్గంలో కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఎల్వీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులు క్రితం ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని సైతం అభియోగాలు..విచారణ పేరుతో కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లేందుకు ఏపీ నుండి రిలీవ్ చేయటానికి ప్రభుత్వం అడ్డు చెప్పింది.
ఆ సమయంలో ఆయన డీమ్డ్ టు బి రిలీవ్ కింద ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీని ద్వారా ఏపీ నుండి రిలీవ్ అయి కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఇప్పుడు ఎల్వీ సుబ్రమణ్యం సైతం ఇదే మార్గాన్ని సిద్దం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం తనను రిలీవ్ చేయకుండా అడ్డు చెప్పటానికి ఏ రకమైన కారణం లేదని..అలా చేసినా..తాను కేంద్ర సర్వీసులకు వెళ్లటం ఆగదని తనను ఈ మధ్య కాలంలో కలిసిన కొందరు ఐఏఎస్ లకు ఎల్వీ చెప్పినట్లుగా అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది.