జగన్ కేసుపై మాజీ సిఎస్ రమాకాంత్ షాకింగ్: ఇలా ప్రశ్నించానంటూ...
జగన్ కేసును సిబిఐ దర్యాప్తు చేసిన తీరుపై మాజీ సిఎస్ రమాకాంత్ రెడ్డి పలు కీలకమైన అంశాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయి సంచలనం రేపుతోంది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. జగన్ కేసు దర్యాప్తునకు అప్పట్లో నేతృత్వం వహించిన లక్ష్మీనారాయణకు తాను వేసిన ప్రశ్నల గురించి, ఆయన ఇచ్చిన సమాధానాల గురించి ఆయన వివరించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు చెందిన సాక్షి టీవీలో ప్రసారమైన కెఎస్ఆర్ లైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందుకు సంబందించిన వీడియోలోని కీలకమైన అంశాలతో వీడియోను యూట్యూబ్లో పెట్టారు. అది వైరల్ అవుతోంది. ఆ వీడియోను సాక్షి టీవీ చానెల్ శనివారంనాడు పదే పదే ప్రసారం చేసింది. సిబిఐ ముందు తాను రెండుసార్లు హాజరయ్యానని రమాకాంత్ రెడ్డి చెప్పారు. సిబిఐ బృందానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నియమనిబంధనలు తెలియవని, వారికి అవన్నీ చెప్పడానికి తనకు ఒక్క రోజు పట్టిందని ఆయన అన్నారు.
తాను మహిళా అధికారిని కూడా పిలిపించి వాటిని వివరించినట్లు ఆయన తెలిపారు. తాను చెప్పిన పేర్లను విచారణకు పిలువడం లేదు కదా, విదేశాలకు కూడా దర్యాప్తు కోసం వెళ్లడం లేదు కదా, కేసు నిలబడుతుందా అని తాను దర్యాప్తు అధికారిని అడిగానని ఆయన చెప్పారు. దర్యాప్తు పరిధిని పెంచుకుని దేని సమయం పెట్టాలి, దేని మీద సమయం పెట్టకూడదని నిర్ణయించుకుని చేసి ఉంటే ఫలితం కొంత వచ్చి ఉండేదేమోనని అన్నారు.
ఆ అధికారి ఎవరు అనేది...
తనను విచారించిన సిబిఐ అధికారి, దర్యాప్తునకు నేతృత్వం వహించిన అధికారి పేరు చెప్పడానికి రమాకాంత్ ఇష్టపడలేదు. అయితే కెఎస్ఆర్ ఆయన పేరు చెప్పారు. "నన్ను పిలిచారు కదా, వారిని కూడా విచారణకు మీరు పిలుస్తారా అని అడిగాను. మంత్రివర్గం నిర్ణయం చేస్తుంది. దానికి నేతృత్వం వహించేది ముఖ్యమంత్రి. మీరు విచారించడానికి ముఖ్యమంత్రి ప్రస్తుతం లేరు. మంత్రివర్గాన్నంతా పిలుస్తారా. పిలిస్తే సమిష్టి నిర్ణయమని అంటారు. మంజూరు చేసిన అధికారిని పిలుస్తారా. ఎలా పిలుస్తారు. అందువల్ల మీ దర్యాప్తుపై నాకు నమ్మకం లేదు" అని తాను అడిగినట్లు రమాకాంత్ రెడ్డి చెప్పారు.
నిర్ణయంపై కారణం చెప్పాల్సిన అవసరం లేదు..
మంత్రి వర్గం ఒక్క నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నామనే కారణాన్ని చెప్పాల్సిన అవసరం మంత్రివర్గానికి లేదు. అలా చెప్పాల్సిన అవసరం లేదని నిబంధన స్పష్టంగా ఉంది. దర్యాప్తు అధికారి నుంచి తనకు సరైన సమాధానాలు రాలేదని రమాకాంత్ రెడ్డి చెప్పారు. తన ముందు 48 ఫైళ్లు పెట్టి మీరు ఎందుకు సంతకం చేశారని తనను అడిగారని ఆయన చెప్పారు. ఎందుకు సంతకాలు చేశారని అడిగితే తాను చెప్పినట్లు ఆయన తెలిపారు.
జెడి ఇలా చెప్పారని రమాకాంత్...
"మీరు ఇన్వెస్టిగేటింగ్ అధికారి కదా... "ఎందుకు మరింత లోతుగా దర్యాప్తు చేయకూడదు... హైకోర్టు మీకు ఫలానా ఆఫీసుకు వెళ్లాలని చెబుతుందా" అని తాను అన్నట్లు రమాకాంత్ రెడ్డి చెప్పారు. " అదంతా ఇప్పుడు కదపలేమండి. పెద్ద విషయమవుతుందని జెడి అన్నారు. రెండో విషయం అడిగాను.. మీరు విదేశాలకు వెళ్లి దర్యాప్తు చేస్తారా.. అని ఆయన చెప్పారు. "వెళ్లం, రెగొటరీ లేఖలు పంపిస్తాం" అని జెడి చెప్పినట్లు ఆయన తెలిపారు.
వెళ్లకుండా ఎలా, కరెక్టు కాదు...
అలాంటప్పుడు మీ విచారణ కరెక్ట్ కాదని తాను చెప్పినట్లు రమాకాంత్ రెడ్డి తెలిపారు. "అక్కడ సూట్కేసు కంపెనీలన్నారు.. వాటికి వెళ్లకుండా విదేశాలకు వెళ్లకుండా బ్యాంకులను సంప్రదించకుండా.. మీరెలా ఇన్వేస్టిగేషన్ పూర్తి చేస్తారని ప్రశ్నించాను" అని ఆయన చెప్పారు. దానికి లేటర్లు రాస్తామని, సమాచారం వస్తే వస్తుంది, లేదంటే లేదని దర్యాప్తు అధికారి చెప్పారని ఆయన వివరించారు.
తనకు తెలుసు అంటూనే...
తన ఇంటర్వ్యూ రికార్డు అవుతుందని, సిబిఐ అధికారులు చూస్తారని కూడా తనకు తెలుసునని అంటూనే రమాకాంత్ రెడ్డి కీలకమైన విషయాలు మాట్లాడారు. అప్పుడు అధికారి ఎవరు ఉండేవారో మీకు తెలుసు అన్నారు. దానికి లక్ష్మినారాయణ అని కెఎస్ఆర్ చెప్పారు.
కాంగ్రెసు ప్రోద్బలం ఉందా అని...
కాంగ్రెసు ప్రోద్బలం వల్లనే ఇదంతా జరిగిందా అని కెఎస్ఆర్ అడిగితే అది తెలియదు గానీ తనకు ఏమనిపించిందంటే అసలు రాష్ట్ర నిబంధనలను అర్తం చేసుకుని సమయం దేని మీద పెట్టాలి, దేని మీద పెట్టకూడదు అని విచారణ పరిధిని పెంచుకుంటే ఫలితం కాస్తా ఫలితం ఉండేదేమో అని అనిపించిందని ఆయన అన్నారు. ఈ కేసులో ఓ ముఖ్యమంత్రి కుమారుడిని అన్ని రోజులు జైల్లో పెట్టడం ఎంత వరకు కరెక్టు అని కెఎస్ఆర్ ప్రశ్నిస్తే - జైల్లో ఉన్నవారు న్యాయస్థానానికి వెళ్లి అన్యాయమని చెప్పే అవకాశం ఉంటుందని, అంతిమంగా తీర్పు ఎది వచ్చినా ముందయితే అరెస్టు చేస్తాం కదా. అదో సమస్య అని రమాకాంత్ రెడ్డి సమాధానం చెప్పారు. న్యాయస్థానం వెంటనే బెయిల్ ఇస్తే మరో సమస్య అని ఆయన అన్నారు. పదేళ్లు ట్రయల్ జరిగిన తర్వాత నిర్దోషులుగా బయటపడిన సందర్భాలున్నాయని, అలా నిర్దోషులుగా బయటపడినప్పుడు ఇన్నాళ్లు జైల్లో పెట్టి వారి స్వాతంత్య్రాన్ని హరించాం కదా అని బాధనిపిస్తుందని రమాకాంత్ రెడ్డి అన్నారు.