జగన్ పార్టీలోకి దినేష్ రెడ్డి: మల్కాజిగిరి లేదా ఒంగోలు?
హైదరాబాద్: మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్రెడ్డి సోమవారం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులో చేరనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన దినేష్రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన జగన్మోహన్రెడ్డితో లోటస్పాండ్లో భేటీ అయ్యారు. తాను పార్టీలో చేరే విషయాన్ని జగన్కు వివరిస్తూ నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే సిటింగ్ ఎంపీ మేకపాటి ఉన్నందున సాధ్యం కాదని జగన్ స్పష్టం చేయడంతో మల్కాజ్గిరి లేదా ఒంగోలులో ఏదో ఒక స్థానాన్ని కేటాయించాలని కోరినట్లు తెలిసింది. పరిశీలిస్తానని జగన్ చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
దినేష్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డిజిపిగా పనిచేశారు. ఆయన తన పదవికి పొడగింపు ఆశించారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో అంగీకరించలేదు. పదవీ విరమణ చేసిన తర్వాత దినేష్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
కాగా, దినేష్ రెడ్డి బిజెపిలో చేరుతారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, చాలా కాలం ఆయన మౌనంగా ఉన్నారు. చివరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామం వల్ల అర్థమవుతోంది.