వెంటనే ఆ పరిహారం అందాలి... అవి కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలి... సీఎం జగన్ కీలక ఆదేశాలు
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ప్రభుత్వం రైతులకు పరిహారం అందించే దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 31 లోగా పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే వరదల కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో పునరుద్దరణ పనులు ఏమాత్రం ఆలస్యం కావద్దని సూచించారు. ఆర్&బీ, పంచాయతీ రాజ్ మరమ్మతులు వెంటనే మొదలుపెట్టాలన్నారు. వర్షాలు,కోవిడ్ 19,నాడు-నేడు,విలేజ్ హెల్త్ క్లినిక్స్ తదితర అంశాలపై మంగళవారం(అక్టోబర్ 21) సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
జగన్ దెబ్బ.. రఘురామరాజు అబ్బా - జస్టిస్ రమణపై ఇవి చూశారా? 777 రెడ్లకు పదవులు: వైసీపీ ఎంపీ
బడ్జెట్ ప్రతిపాదనలపై...
వర్షాలు,వరదలకు కూలిన ఇళ్లను గుర్తించి వెంటనే వారికి సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. బాధితుల పట్ల మానవతాదృక్పంతో వ్యవహరించాలని సూచించారు. పంట నష్టం అంచనాలతో పాటే బడ్జెట్ ప్రతిపాదనలు కూడా అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతంగా చేపట్టినందుకు కలెక్టర్లను అభినందించారు.
ఈ నెల 27న రైతు భరోసా...
అక్టోబర్ 27న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒక సీజన్ ఇన్పుట్ సబ్సిడీని అదే నెలలో ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీని వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత చెల్లింపులతో పాటు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. జూన్, జులై, అగస్టుతో పాటు సెప్టెంబరు నెల ఇన్పుట్ సబ్సిడీని ఈనెల 27న ఇస్తున్నామన్నారు. ఖరీఫ్ పంటలకు రూ.113కోట్లు,ఉద్యాన పంటలకు రూ.32కోట్లు మొత్తం రూ.145కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించబోతున్నట్లు చెప్పారు. అలాగే అటవీ భూమి పట్టాలు కలిగిన గిరిజనులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద ఈ నెల 27న రూ.11500 చొప్పున ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
వాటిని కూడా ఆరోగ్యశ్రీలోకి...
కరోనా గురించి ప్రస్తావిస్తూ... రాష్ట్రంలో ప్రతి రోజూ 70 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, పాజిటివిటీ రేటు బాగా తగ్గిందని అన్నారు. గతవారంలో 5.5శాతం ఉన్న పాజిటివిటీ రేటు అక్టోబర్ 19న 4.76శాతానికి తగ్గిందన్నారు. అయితే కరోనా తగ్గిన తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో... నెగటివ్ వచ్చిన 6 నుంచి 8 వారాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కిడ్నీ,గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్న కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని హెల్త్ సెక్రటరీలకు ఆదేశాలిచ్చామన్నారు.
Recommended Video
మరింత అవగాహన కల్పించేలా...
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని... అలాగే ఆరోగ్య మిత్రలకు పూర్తి శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రోగులకు అందుతున్న సేవలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు సమర్పించాలన్నారు. మాస్కులు ధరించడం, శానిటైజేషన్, భౌతికదూరంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. 104 నంబరుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని... ఆ నంబరుకు ఫోన్ చేస్తే 30 నిమిషాల్లో కరోనా ఆస్పత్రిలో బెడ్ కేటాయించాలని సూచించారు.