మంత్రినే హత్య చేస్తామంటారా?: జగన్ పార్టీ నేత వసంతకు బాబు హెచ్చరిక, ఆడియో టేప్, కేసు
Recommended Video
అమరావతి: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హత్య చేస్తామనే రీతిలో బెదిరింపులకు పాల్పడతారా? అంటూ మాజీ హోంమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసిన వసంత నాగేశ్వరావు బెదిరింపులకు పాల్పడ్డారు.
కాంగ్రెస్తో పొత్తు: అందుకే టీటీడీపీ పైనే చంద్రబాబు భారం, ఈ సీట్లు అడుగుదాం..
ఈ క్రమంలో వసంత నాగేశ్వరరావుపై కేసు కూడా నమోదైంది. కాగా, అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. వసంత నాగేశ్వరరావు వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యదర్శికి వసంత బెదిరింపులు
ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వసంత నాగేశ్వరరావుపై కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. తనకు ఫోన్ చేసి బెదిరించారని గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నల్లారి వెంకటనరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.
అవసరమైతే కడప నుంచి మనుషలు..
గ్రామంలో ఫ్లెక్సీల తొలగింపు విషయంలో సెప్టెంబర్ 7న సాయంత్రం విధుల్లో ఉన్న తనకు వసంత నాగేశ్వరరావు ఫోన్ చేసి తెలుగుదేశం ఏజెంటుగా పనిచేస్తున్నావంటూ బెదిరించారని ఆరోపించారు. మీ మంత్రిని (దేవినేని ఉమాను) ఏమైనా చేస్తామని, అవసరమైతే కడప నుంచి మనుషులను తెప్పిస్తామని మాట్లాడారని కార్యదర్శి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ ఆరా తీశారని.. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వివరించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆడియోటేప్ను విన్నారు.
నా కొడుకు నాలా కాదంటూ ఆడియో టేప్లో ఇలా..
ఆ ఆడియో టేప్లో ‘నేనైతే ఒక పద్ధతి కలిగిన వ్యవహారంగా చేస్తా. కానీ కృష్ణప్రసాద్ (వసంత నాగేశ్వరరావు కుమారుడు) అలా కాదు. మొండిగా వ్యవహరిస్తాడు. తాడోపేడో తేల్చుకోవాలనే లెక్కల్లో ఉన్నాడు. డబ్బుకు, మర్డర్లకు తెగించే ఉన్నాడు. ఉమా దాడి చేయలేడనే భావన వాళ్ల మనుషుల్లో ఉంది. ఒక్క కృష్ణప్రసాద్కే కాదు.. జగన్కు కూడా వీడిపై(దేవినేని ఉమా) కక్ష ఉంది. అతడు అసెంబ్లీలో అసహ్యంగా మాట్లాడుతున్నాడు అని. వీడిని శాసనసభలో చూడడానికి వీల్లేదని జగన్కూ ఉంది. గుంటూరు-2 టికెట్ ఇస్తానని సీఎం ప్రత్తిపాడు వాళ్లను పంపాడు. నేను ఓడించాలన్న (దేవినేని ఉమాను) లక్ష్యంతో వచ్చా. తాడోపేడో తేల్చుకోవాలి' అని వసంత వ్యాఖ్యానించారు.
ఫోరెన్సిక్ టెస్టుకు ఆడియో టేప్..
కాగా, న్యాయసలహా కోసం పోలీసులు ఆడియోటేపును ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని, పరుష పదజాలంతో బెదిరించారన్న అంశంపై వసంత నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్కిషోర్ తెలిపారు.
హత్య చేస్తామంటారా? వసంతకు చంద్రబాబు తీవ్ర హెచ్చరిక
ఇది ఇలా ఉంటే, మంత్రి దేవినేని ఉమాను హత్య చేస్తామనే రీతిలో బెదిరింపులకు దిగిన మాజీ మంత్రి, వైకాపా నేత వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. బెదిరింపులు, హత్యలతో ఎవరూ ఏమీ సాధించలేరని.. ఇలాంటి చర్యలను ఎంతటివారు ప్రోత్సహించినా తీవ్రస్థాయిలో చర్చలుంటాయని హెచ్చరించారు. మంత్రిని హత్య చేస్తాం అనే ధోరణిలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని వ్యూహ కమిటీ సమావేశంలో సీఎం తెలిపారు.