వివేకా హత్య కేసు సీబీఐకి ఇవ్వండి: సిట్ వైఖరిపై అనుమానం: హైకోర్టుకు మాజీ మంత్రి ఆది ..!
మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది. ఇప్పటికే కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టు ఇదే విధంగా దాఖలు చేసిన పిటీషన్ విచారణలో ఉంది. ఇప్పుడు అదే కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసారు.
వివేకా హత్య కేసును సీబీఐ లేక రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని తన పిటీషన్ లో కోరారు. అదే సమయంలో ఈ కేసును విచారిస్తున్న సిట్ వైఖరిని చూస్తే..అమాయకులను కేసులో ఇరికించేలా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేసారు. ఇప్పటికే బిటెక్ రవి దాఖలు చేసిన పిటీషన్ పైన ప్రభుత్వానికి ..సిట్ కు హైకోర్టు కీలక సూచనలు చేసింది.
హైకోర్టులో ఆది పిటీషన్..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ లేక రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మాజీ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఆయన సిట్ విచారణ ఎదుర్కొన్నారు. హత్య జరిగిన సమయంలో తాను విజయవాడలో ఉన్నానని..తనకు హత్యతో ప్రమేయం ఉన్నట్లుగా తేలితే తనను ఎన్ కౌంటర్ చేయాలంటూ వ్యాఖ్యానించారు.
అదే విధంగా ఏ మాత్రం సంబంధం ఉన్నా నడిరోడ్డుపైన ఉరి తీయాలని కామెంట్ చేసారు. ఇప్పుడు ఆయన ఇదే అంశం పైన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ పైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేసారు. సిట్ వైఖరి చూస్తూ అమాయకుల్ని కేసులో ఇరికించేలా ఉందని అనుమానం వ్యక్తంచేశారు.ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు ఉన్నాయని, అందువల్ల వివేకా హత్య కేసును సీబీఐ లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.
ఇప్పటికే బీటెక్ రవి పిటీషన్ పై..
ఇదే అంశం పైన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ సాగుతోంది. దీన పైన ఇప్పటి వరకు జరిగిన విచారణ పైన సీల్డ్ కవర్ ల్ నివేదిక ఇవ్వాలని హైకోర్టు సిట్ కు సూచన చేసింది. వివేకా హత్య కేసు విచారిస్తున్న సిట్ బీటెక్ రవిని సైతం విచారించింది. హత్య జరిగిన సమయంలో కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని కోరిన వారు..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు సీబీఐకు ఇవ్వటం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో..గురువారం మాజీ మంత్రి ఆది దాఖలు చేసిన పిటీషన్ విచారణకు రానుంది.