వైసీపీలోకి మాజీ మంత్రి ఆది బ్రదర్స్..! 23న సీఎం సమక్షంలో: రామసుబ్బారెడ్డి ఛాన్స్ లేకుండా..!
సీఎం సొంత జిల్లాలోని జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తొలి నుండి వైయస్ కుటుంబానికి విధేయులుగా ఉంటూ..2014 ఎన్నికల్లోనూ వైసీపీ నుండి గెలిచి ఆ తరువాత టీడీపీ లోకి వెళ్లి మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి కుటుంబం ఇప్పుడు తిరిగి జగన్ వైపు చూస్తోంది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరులు వైసీపీలో చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం ఆది బీజేపీలో చేరారు. అయితే, ఇప్పుడు ఆయన సోదరులు జగన్ తో కలిసి తిరిగి రాజకీయంగా నడవాలని భావిస్తున్నారు. అందుకోసం వైసీపీలో చేరేందుకు ఈ నెల 23న ముహూర్తం ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, అక్కడ టీడీపీ నేత రామసుబ్బారెడ్డి సైతం వైసీపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం సాగుతున్న పరిస్థితుల్లో..వీరు ముందడుగు వేసినట్లుగా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. సీఎం కడప జిల్లా పర్యటనలో వీరు వైసీపీలో చేరటం దాదాపు ఖాయమైంది.
వైసీపీలోకి ఆది బ్రదర్స్..
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులు వైసీపీలో చేరటానికి రంగం సిద్దమైంది. వైయస్ ఉన్న సమయం నుండి జమ్మలమడుగులోని నారాయణ రెడ్డి సోదరులు వైయస్ కు విధేయులుగా ఉండేవారు. మాజీ మంత్రి ఆది సోదరుడు నారాయణరెడ్డి జమ్మలమడుగు నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగానూ పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తరువాత ఎమ్మెల్సీ అయ్యారు. ఇక, 2004,2009 లో వైయస్ హాయంలోనే మాజీ మంత్రి ఆదికి కాంగ్రెస్ టిక్కట్ దక్కింది..రెండు సార్లూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత జగన్ తో కలిసి 2014లో వైసీపీ నుండి గెలుపొందారు. తరువాతి కాలంలో టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అనేక సందర్బాల్లో జగన్ పైన వ్యక్తిగత విమర్శలు సైతం చేసారు. ఇక, ఇప్పుడు ఆది బీజేపీలో ఉండగా..ఆయన సోదరులు ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, మరో సమీ...సమీప బంధువు తాతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
ముహూర్తం ఖరారు..సీఎం పైన ప్రశంసలు..
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరులు ఈ నెల 23న జమ్మలమడుగులోనే సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వారు పార్టీ నేతలతో మంతనాలు సైతం పూర్తి చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ పైన ఆది సోదరుడు ప్రశంసలు గుప్పించారు. జమ్మలమడుగులో స్టీల్ ఫ్యాక్టరీ సుదీర్ఘ నిరీక్షణ తరువాత సాకారం అవుతోందని సంతోషం వ్యక్తం చేసారు. సీఎం జగన్ తీసుకున్న 75 శాతం స్థానిక రిజర్వేషన్ కారణంగా..తమ ప్రాంతానికి చెందిన అనేక మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పుకొచ్చారు.
ఈ నెల 23న జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్ల పల్లె వద్ద సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. అయితే, వైసీపీలో చేరటం మీద వారు అధికారికంగా మాత్రం స్పందించ లేదు. పార్టీ నుండి అందుతున్న సమాచారం మేరకు సీఎం సమక్షంలో వారి చేరిక ఖాయమైనట్లుగా తెలుస్తోంది.
రామసుబ్బారెడ్డికి ఛాన్స్ లేకుండా...!
జమ్మలమడుగు నియోకవర్గంలో తమ చిరకాల ప్రత్యర్ధి..టీడీపీ నేత రామసుబ్బారెడ్డికి చెక్ పెట్టేందుకే నారాయణ రెడ్డి సోదరులు వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గత ఆగస్టులో సీఎం జగన్ ను టీడీపీ నేత రామసుబ్బారెడ్డి కలిసిన ఫొటో అప్పట్లోనే వైరల్ అయింది. అయితే, అది అమెరికా విమానాశ్రయంలో ఎదురు పడ్డామని రామసుబ్బారెడ్డి తమ పార్టీ అధినేతకు వివరణ ఇచ్చారు.
అయితే, జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు..స్టీల్ ఫ్యాక్టరీ నిర్ణయం తరువాత రామసుబ్బారెడ్డి వర్గీయులు ఆయన్ను వైసీపీలో చేరే విధంగొ కోరుతున్నట్లు ప్రచారం. దీని పైన గతంలోనే రామసుబ్బారెడ్డి ఆలోచన చేసినా.. టీడీపీ అధినేత చంద్రబాబు వారించటంతో ఆగిపోయారు. తిరిగి..ఇప్పుడు రామసుబ్బారెడ్డి ఆలోచనలను పసి గట్టిన నారాయణ రెడ్డి వర్గం వేగంగా పావులు కదిపినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే .. సీఎం సమక్షంలో తిరిగి వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.