ఎట్టకేలకు బీజేపీలో చేరిన ఆది: జగన్ ను ఎదుర్కొని.. నిలబడాలంటే: ఒంటరి పోరాటమేనా..!
ఎట్టకేలకు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. కాంగ్రెస్..వైసీపీ..టీడీపీ..ఇప్పుడు నాలుగో పార్టీగా బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినా..సొంత జిల్లాకు చెందిన తాజా బీజేపీ నేత సీఎం రమేష్ రాజకీయం కారణంగా ఆగిందని ప్రచారం. ఆదినారాయణ రెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ భేటీ అయ్యారు.
తనకు ఎన్నికల సమయంలో ఆర్దికంగా ఇచ్చిన కమిట్ మెంట్స్ పూర్తి చేయాలని కోరినట్లు సమాచారం. అయితే పార్టీ వీడవద్దని చంద్రబాబు సూచించారు. కానీ, ఆది తాను జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు..జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం..జిల్లా టీడీపీ నేతల నుండి సహకారం లేకపోవటం.. వైసీపీ నేతలకు రాజకీయంగా తానే లక్ష్యం కావటంతో..ఇక, అదినారాయణ రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించారు. అనేక అడ్డంకుల తరువాత ఈ రోజు అధికారికంగా బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు.
నాడు చంద్రబాబు మాట కోసం..కానీ..
2014లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా జమ్మలమడుగు నుండి గెలిచిన ఆదినారయణ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించారు. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. అప్పటి నుండి వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా రాజకీయాలు చేసారు. అసెంబ్లీలో..బయటా జగన్ పైనా వ్యక్తిగతంగా ఆరోపణలు గుప్పించారు. ఇక, జమ్మలమడుగులో చిరకాల ప్రత్యర్ధి రామసుబ్బారెడ్డితో కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. జగన్ ను ఎదుర్కోవాలంటే చంద్రబాబు మాట వినాలనే ఉద్దేశంతో రామ సుబ్బారెడ్డితో రాజీపడి మరి తాజగా జరిగిన ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసారు.
ఒప్పందంలో భాగంగా రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఇద్దరూ ఎన్నికల్లో ఓడిపోయారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జిల్లా రాజకీయాల్లో ఆదినారాయణ రెడ్డి ఒంటరివారయ్యారు. దీంతో..బీజేపీలో చేరాలని నిర్ణయించారు.
టీడీపీ నుండి వెళ్లిన నేతలే అడ్డుపడినా..
ఆదినారాయణ రెడ్డి గతంలోనే బీజేపీలో చేరాల్సి ఉంది. అయితే, ఆయనకు సొంత జిల్లాకు చెందిన సీఎం రమేష్ అడ్డుపడినట్లు ప్రచారం. టీడీపీలో ఉన్న సమయం నుండే ఇద్దరి మధ్య రాజకీయంగా గ్యాప్ ఉంది. ఆది బీజేపీలో చేరితే జిల్లాలో తనకు పోటీ అవుతాడనేది సీఎం రమేష్ అభిప్రాయంగా తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ నుండి బీజేపీలోకి ఫిరాయించిన నలుగురు ఎంపీల్లో ఏ ఒక్కరూ లేకుండానే ఆదినారాయన రెడ్డి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు సహకారంతో బీజేపీలో చేరారు.
నడ్డా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. బీజేపీలో చేరాలని నిర్ణయించిన తరువాత ఆది నేరుగా అమరావతికి వెళ్లి చంద్రబాబుతోనూ చర్చలు చేసారు. తాను పార్టీ మారుతున్న విషయాన్ని స్పష్టం చేసారు. అప్పటికే ఎన్నికల్లో భాగంగా ఆర్దిక కమిట్ మెంట్ల విషయంలో ఆది నష్టపోయారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీని మీద మాట్లాడినా టీడీపీ అధినేత నుండి ఎలాంటి హామీ రాలేదని..దీంతో ఆయన బీజేపీలో చేరుతున్న విషయం తేల్చి చెప్పినట్లుగా సమాచారం.
ఆది..ఇక ఒంటరి పోరేనా..
టీడీపీ నుండి అనేక కారణాలతో బీజేపీలో చేరినా జిల్లాలో మాత్రం ఆదికి ఒంటరి పోరు తప్పేలా లేదు. జిల్లా నుండి ఎన్నికైన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పది అసెంబ్లీ స్థానాలతో పాటుగా లోక్ సభ స్థానంలో నూ వైసీపీ గెలిచింది. సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో వైసీపీ గెలవటంతో పాటుగా..రామసుబ్బారెడ్డి ఇప్పుడు మరలా ప్రత్యర్దిగా మారే అవకాశం ఉంది. ఇక, బిజేపీలోనే ఉన్నా సీఎం రమేష్ సహకరించే పరిస్థితి లేదు.
అటు వైసీపీ ..ఇటు టీడీపీ రెండు పార్టీలకు ఇప్పుడు ఆది జిల్లాలో లక్ష్యంగా మారనున్నారు. దీంతో..ఆయన బీజేపీలో సైతం ఎంత కాలం కొనసాగుతారనేది వేచి చూడాల్సిందేననే వాదన అప్పుడే పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. అయితే, ప్రస్తుతుం వైసీపీ ప్రభుత్వాన్ని తట్టుకొని నిలబడాలంటే ఖచ్చితంగా బీజేపీ మాత్రమే సరైనదిగా ఆది భావించారు. అదే విధంగా పార్టీలో చేరారు. దీంతో, రానున్న రోజుల్లో కడప జిల్లాలో చోటు చేసుకొనే రాజకీయ పరిణామాలు ఆసక్తి కరంగా మారనున్నాయి.