బీజేపీలోకి మాజీ మంత్రి ఆది: టార్గెట్ వైసీపీ..రెడ్డి నేతలకు వల : చంద్రబాబు కాదు..జగన్ పైనే ఫోకస్..!!
ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. అందులో ప్రధానంగా రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గ నేతలకు వల వేస్తోంది. కోస్తా ప్రాంతంలో కమ్మ ..కాపు నేతలతో మంతనాలు సాగిస్తున్న బీజేపీ ప్రతినిధులు రాయలసీమలో రెడ్డి వర్గా నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే కొంత కాలంగా సాగుతున్న చర్చలకు ముగింపుగా కడప జిల్లాలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిక ఖరారైంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తో ఉన్న చిన్నపాటి విబేధాల కారణంగా.. ఆయన గతంలోనే బీజేపీలో చేరాల్సి ఉన్నా ఆగిపోయారు. అయితే , ఇప్పుడు స్వయంగా సీఎం రమేష్ నేరుగా ఆది తో చర్చలు జరపటంతో ఆయన మనసు మార్చుకొని.. బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లుగా సమాచారం. నిజంగా..బీజేపీ ఆశిస్తున్నట్లుగా రాయలసీమ ప్రాంతంలో రెడ్డి వర్గ నేతలను తమ పార్టీ చేర్చుకుంటే..జగన్ ను దెబ్బ తీయచ్చా.. రాజకీయంగా అది సాధ్యమేనా..ఇప్పుడు బీజేపీ కొత్త అడుగులు నయా సమీకరణాలకు కారణమవుతోంది.
టీడీపీ వద్దు..బీజేపీ ముద్దు..
ఏపీలో ఎలాగైన బలం పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ సామాజిక వర్గాల వారీగా నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా.. టీడీపీ కి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇప్పటకే బీజేపీలో చేరారు. అందులో ఒకరైన కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతల వద్ద తన పరపతి పెంచుకొనేలా వ్యవహరిస్తున్నారు. దీని కోసం పార్లమెంట్ లో ప్రభుత్వానికి అనుకూలంగా బిల్లుల సమయంలో ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నించి..సక్సెస్ అయ్యారు. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కాపు..కమ్మ వర్గాల నేతలను బీజేపీలోకి తీసుకురావటంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొంత మంది నేతలను బీజేపీలోకి తీసుకెళ్లారు. ఇక, ఇదే సమయంలో టీడీపీతో పాటుగా వైసీపీని రాజకీయంగా దెబ్బ తీయాలనేది బీజేపీ నేతల వ్యూహం. అందులో భాగంగా..టీడీపీ లో ఉన్న సమయంలో చంద్రబాబు కోటరీ మనుషులుగా ఉంటూ జగన్ పైన రాజకీయ యుద్దం చేసిన ఆ నేతలే ఇప్పుడూ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్ సొంత జిల్లాకు చెందిన సీఎం రమేష్ ఇప్పుడు జగన్ పైన బలంగా వ్యతిరేక వాయిస్ వినిపించగలిగిన రెడ్డి వర్గ నేతలను ట్రాప్ చేస్తున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి..జమ్మల మడుగు నేత ఆదినారాయణ రెడ్డితో మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అనేక తర్జన భర్జన ల తరువాత ఆదినారాయణ రెడ్డి సైతం అంగీకారం తెలిపినట్లు తెలిసింది.
రెడ్డి వర్గంతో..టార్గెట్ వైసీపీ..
రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గా నేతలను బీజేపీ ఒకరి తరువాత మరొకరిని తమ దారిలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా.. కర్నూలు జిల్లాలో బలమైన వర్గంగా ఉన్న భూమా కుటుంబానికి చెందిన వారసులను తాజాగా బీజేపీ నేతలు తమ పార్టీలోకి చేర్చుకున్నారు. అనంతపురం జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా రాజకీయ ఆధిపత్యం సాగిస్తున్న బ్రదర్స్ తోనూ మంతనాలు చేస్తోంది. అదే సమయంలో అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు టీడీపీలో చక్రం తిప్పిన మరో ముఖ్యమై కుటుంబం సైతం బీజేపీ ఆఫర్ ను కాదనలేక..టీడీపీ నుండి బయటకు రాలేక సతమతం అవుతోంది. తాజగా జరిగిన ఎన్నికల్లో ఏపీలో గెలుపు ఓటములను ప్రభావిం చేయగలిగిన సామాజిక వర్గాలు ఎవరి వైపు మొగ్గు చూపాయి..ఏ సమీకరణాలు పని చేసాయనే దాని పైన సీనియర్ నేత రాం మాధవ్ అనేక మంది నుండి సమాచారం సేకరించారు. అంధులో భాగంగానే కోస్తా ప్రాంతంలో కమ్మ వర్గానికి చెందిన నేతల వద్దకు స్వయంగా ఆయనే వెళ్లి..బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. ఇక, రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం అధిక శాతం జగన్ కే ఓటు వేసింది. దీంతో.. ఆ సామాజిక వర్గంలోని నేతలను తమ వైపు తిప్పుకొనే కార్యాచరణ బీజేపీ వేగవంతం చేసింది. త్వరలోనే కడప తో పాటుగా కర్నూలు..అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు ముఖ్యులు బీజేపీలో చేరుతారని సమాచారం.
జగన్ పైన ఇక..నిత్యం పోరాటమే...
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇంకా మూడు నెలలు పూర్తి కాలేదు. ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నాతో పాటుగా కేంద్రం నుండి వస్తున్న కొందరు నేతలు సైతం ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక, టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుల లక్ష్యం జగన్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా బీజేపీ నేతలు చంద్రబాబు పైన ఆరోపణలు..విమర్శలు తగ్గించారు. సమీకరణాలల్లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తున్నారనే విషయం అర్దం అవుతోంది. ఇక, జగన పైన బలంగా వ్యతిరేక వాయిస్ వినిపించే నేతల కోసం అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా భూమ ఫ్యామిలీతో పాటుగా.. తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, రెడ్డి వర్గానికి చెందిన నేతలను బీజేపీ లోకి తీసుకోవటం ద్వారా.. జగన్ ను రాజకీయంగా దెబ్బ తీయటం సాధ్యమేనా.. రానున్న రోజుల్లో టార్గెట్ జగన్ రాజకీయంగా మరింత వేగం పుంజుకొనే అవకాశం ఉంది.