ఏ2 నుండి ఏ1 కి మారిన మాజీ మంత్రి అఖిల ప్రియ .. బోయినపల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్
భూవివాదంలో ముగ్గురు వ్యాపారులను కిడ్నాప్ చేసిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన టీడీపీ నేత ,మాజీ మంత్రి భూమా అఖిలప్రియను నిన్న ఈ కేసులో రెండో నిందితురాలిగా పేర్కొన్న బోయినపల్లి పోలీసులు ఈ రోజు హఠాత్తుగా ఆమె ను ఏ1 గా మారుస్తూ రిమాండ్ రిపోర్ట్ ను రిలీజ్ చేశారు.
Recommended Video
గర్భవతి అయిన మాజీమంత్రి అఖిల ప్రియకు బెయిల్ వస్తుందా ? లేదా .. కోర్టులో విచారణపై ఉత్కంఠ
కిడ్నాప్ కేసులో ఏ1 గా భూమా అఖిలప్రియ
ఇప్పటివరకు ఈ కేసులో ఆళ్లగడ్డ కు చెందిన టిడిపి నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ఏ1 గా ఉండగా, ఆయనను ఏ2 గా మార్చి, భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను ఏ3గా రిమాండ్ రిపోర్ట్ లో చేర్చారు. ఇక వీరితో పాటు శ్రీనివాస్ ,చంటి, సాయి, ప్రకాష్ లను కూడా నిందితులుగా చేర్చారు. అంతేకాదు భూమా అఖిలప్రియ పై మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న భూమా అఖిలప్రియ పై నమోదు చేసిన సెక్షన్ ల తో పాటుగా తాజాగా మరో రెండు సెక్షన్లను యాడ్ చేశారు.
మరో రెండు కొత్త సెక్షన్ల క్రింద కేసులు నమోదు .. అఖిల మెడకు బిగుస్తున్న ఉచ్చు
ఐపీసీ సెక్షన్ 147 ,385 లను అదనంగా చేర్చి భూమా అఖిలప్రియ మెడకు పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. హఫీజ్ పేట లో సర్వే నెంబర్ 80 లో 2016 లో బాధితులు 25 ఎకరాలు కొన్నారని అయితే భూమి తమదేనని అఖిలప్రియ, సుబ్బారెడ్డి, భార్గవ్ రామ్ వాదిస్తున్నారు అని బోయినపల్లి పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం భూమా అఖిల ప్రియ , ఏవీ సుబ్బారెడ్డి పథకం ప్రకారం వారిని కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు.
సినీ ఫక్కీలో కిడ్నాప్ కథ .. వెల్లడించిన పోలీసులు
బోయినపల్లి మనోవికాస్ నగర్ లో ఉంటున్న ప్రవీణ్, నవీన్, సునీల్ అని బెదిరించి భూమి హక్కులు రాయించుకునేందుకు ఏవీ సుబ్బారెడ్డి భూమా అఖిలప్రియ పథకం రచించారని, ఈ క్రమంలో వారి అనుచరులకు ఆదాయపన్ను శాఖ పోలీసు శాఖ అధికారులు కూడా వేషాలు వేయించి , నకిలీ గుర్తింపు కార్డులతో ప్రవీణ్ రావు ఇంటికి పంపించారన్నారు పోలీసులు . ఆ తర్వాత ఇంట్లో ఉన్న మహిళలు పిల్లలను ఒక రూమ్ లో బంధించి, ప్రవీణ్ , నవీన్ , సునీల్ లను కళ్ళకు గంతలు కట్టి కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు .
అఖిలప్రియ ఏ1 గా .. ఈ మార్పుకు కారణం ఏంటో ?
కిడ్నాప్ జరిగిన తరువాత అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టడంతో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాలకు కోకాపేట నార్సింగి రహదారిలో వారిని వదిలిపెట్టి పరారయ్యారు. ఇక దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయగా, భార్గవ్ రామ్ పరారీలో ఉన్నారు. అసలు ఏ1 గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి పేరును, ఏ2 గా మార్చి , భూమా అఖిలప్రియను ఏ1 ను చేసిన పోలీసులు ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. అసలు అఖిల ప్రియను ఏ1 గా ఎందుకు మార్చారో అర్ధం కాని అయోమయానికి పోలీసులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.