వైఎస్ జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది: అయ్యన్నపాత్రుడు ధ్వజం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఓ రేంజ్లో ఫైరయ్యారు. జగన్ పాలన తుగ్లక్ను తలపిస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడిందని ధ్వజమెత్తారు.
జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై ప్రధాని మోడీ కలుగజేసుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలను జగన్ సర్కార్ మరింత ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉందని చెప్పారు.
రాజధానిని మారుస్తామని సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. మేనిఫెస్టోలో లేని అంశాలను ఎలా తెరపైకి తీసుకొస్తారని చెప్పారు. అంతేకాదు మహిళలకు అన్యాయం జరిగితే ధిక్కార స్వరం వినిపించే రోజా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మహిళా హోంమంత్రి నోరు కూడా మూగబోయిందని చెప్పారు. వారు స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు నిశీతంగా గమనిస్తున్నారని చెప్పారు.
రాజధాని మార్పుపై ఏపీలో సబ్బండ వర్గాలు పోరుబాట పట్టారు. అమరావతి మార్పును నిరసిస్తూ ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు.