వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహి, కేసీఆర్కు దాసోహమన్న ఏపీ సీఎం, భూమా అఖిలప్రియ ధ్వజం
వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటీ నుంచి స్తబ్ధుగా ఉన్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ.. తిరిగి ఫామ్లోకి వచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం కేసీ కెనాల్ ద్వారా 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే.. సీఎం జగన్ మాత్రం ఎందుకు నీరివ్వడం లేదు అని ప్రశ్నించారు. శ్రీశైలంలో 871 అడుగుల నీటిమట్టం ఉన్నా.. నీరు వదలడం లేదని.. ఇందుకు కారణం సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్కు భయపడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
సీమ ద్రోహి..
నీరివ్వకపోవడంతో సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని భూమా అఖిలప్రియ గుర్తుచేశారు. శ్రీశైలంలో 854 అడుగుల వరకు నీరు విడుదల చేసే వెసులుబాటు ఉన్న జగన్ ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. కేసీ కెనాల్ ద్వారా జగన్ సర్కార్ 2.30 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందించి సీమ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
కక్షపూరితంగా..
గుండ్రెవుల ప్రాజెక్టుపై కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. గత ప్రభుత్వం 3 వేల కోట్లు కేటాయిస్తే.. రద్దుచేశారని విమర్శించారు. ఒకవేళ గుండ్రెవుల పూర్తయితే కేసీ కెనాల్ ఆయకట్టు సస్యశ్యామలం అయ్యేదని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో భయమేస్తుందని భూమా అఖిలప్రియ అన్నారు.
మంచినీరు కూడా..
సాగునీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూశాం.. ఇప్పుడు తాగునీరు దొరకక సీమ ప్రజలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తోందని హెచ్చరించారు. సీమ ప్రజలు ఇప్పటికైనా మేల్కొవాలని సూచించారు. కానీ రాయలసీమ కోసం తాను కృషి చేస్తానని... 26 వేల కోట్ల అవసరమవుతాయని సీఎం జగన్ అంచనా వేశారు. మరి ఇంతవరకు ఒక్క రూపాయి ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.
మాటంటే మాటే
గత ప్రభుత్వం చేపట్టిన పనులను కూడా నిలిపివేసి రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. పులివెందులకు నీరిచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గండికోట రైతులకు రూ.700 కోట్లు అందజేశారని పేర్కొన్నారు. చత్రావతి రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాయలసీమ రిజర్వాయర్లను కూడా నింపడంలో ప్రభుత్వం విఫలమై.. రైతులను ఇబ్బంది గురిచేస్తోందని మండిపడ్డారు.