సీఎం జగన్ కు చిరంజీవి ప్రశంసలు: దిశ చట్టానికి అభినందనలు: పవన్ దీక్ష సమయంలో..ఇలా..!
ఏపీ ప్రభుత్వానికి ప్రముఖ సినీ నడులు ..కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అభినందనలు తెలిపారు. ఏపీ కేబినెట్ తాజాగా ఏపీ దిశా చట్టం - 2019 ఆమోదించటం పైన చిరంజీవి అభినందించారు. కొద్ది రోజుల క్రితం సైరా సినిమాను చూడాలంటూ స్వయంగా చిరంజీవి తన సతీమణితో కలిసి ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఆ సమయంలో సీఎం దంపతులు చిరంజీవి దంపతులకు విందు ఏర్పాటు చేసారు. అదే సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ మెంట్ కోసం తీసుకోవాల్సిన అంశాల పైనా వారిద్దరూ చర్చించారు. త్వరలోనే సినీ ప్రముఖులతో కలిసి మరోసారి వస్తానని చిరంజీవి చెప్పగా..మీరే లీడ్ తీసుకోవాలంటూ జగన్ సూచించారు. ఇక, ఇప్పుడు ఒక వైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ్ముడు పవన్ కాకినాడలో దీక్ష చేస్తున్న సమయంలోనే..చిరంజీవి ఇలా జగన్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ప్రకటన విడుదల చేయటం కాకతాళీయంగా కనిపిస్తున్నా.....రాజకీయంగా మాత్రం చర్చకు కారణమైంది.
తుని విధ్వంసం కేసులు ఎత్తివేత: భోగాపురం నిరసనకారుల పైన కేసులు మాఫీ: కేబినెట్ లో కీలక నిర్ణయం..!
జగన్ ప్రభుత్వానికి అభినందనలు..
ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అభినందించారు. ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేసారు. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతోన్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ తనలో ఉందని పేర్కొన్నారు. దిశ సంఘటన మన అందర్నీ కలిచివేసిందని.ని, ఆ ఎమోషన్స్ తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయని చిరంజీవి అభిప్రాయ పడ్డారు. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం అందరిలో ఉందని పేర్కొన్నారు. అందుకే అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ లో తొలి అడుగులు పడడం హర్షణీయమంటూ చిరంజీవి అభినందించారు.
మనస్పూర్తిగా అభినందిస్తున్నా..
దీనికి కొనసాగింపుగా చిరంజీవి..ఇప్పటి వరకు ఈ కేసుల్లో అమలు చేస్తున్న శిక్షల గురించి ప్రస్తావించారు. సీఆర్పీసీ ని సవరించడం ద్వారా 4 నెలలు అంతకంటే ఎక్కువ పట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించడం.. ప్రత్యేక కోర్టులు ఇతర మౌళిక సదుపాయాల్ని కల్పించడంతో పాటు ఐపీసీ ద్వారా సోషల్ మీడియా ద్వారా మహిళల గౌరవాన్ని కించపరచడం లాంటివి చేస్తే తీవ్రమైన శిక్షలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం ద్వారా నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా చట్టాలు తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తన ప్రకటనలో స్పష్టంగా వివరించారు. ఈ చర్యలతో మహిళా లోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం తనకు ఉందింటూ వివరించారు.
తమ్ముడు దీక్షా వేళ..రాజకీయంగా చర్చ..
దిశ అంశం పైన కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యల పైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. ఇక, ఇప్పుడు పవన్ కళ్యాన్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులకు మద్దతుగా కాకినాడలో దీక్ష చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకొస్తున్న దిశా చట్టం పైన చిరంజీవి అభినందనలు తెలిపారు. అయితే, పవన్ దీక్ష చేస్తున్న అంశం.. చిరంజీవి అభినందించిన అంశం వేర్వేరు అయినా.. ఈ సమయంలో చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని అభినందించటం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.