ఇద్దరూ మొండివాళ్లే, మధ్యవర్తిత్వం వహిస్తా: జోగయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇద్దరు కూడా మొండివాళ్లేనని, వారు కోరితే ఇరువురికి మధ్య తాను మధ్యవర్తిత్వం వహిస్తానని మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నేత చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో మంగళవారంనాడు పాలు పంచుకున్నారు.
కాపు రిజర్వేషన్ల సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కోరితే కాపు పెద్దలు, రిటైర్డ్ ఉన్నతాధికారులు సమస్య పరిష్కారానికి ముందుకు వస్తారని, వారితో కలిసి తాను సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం నెరుపుతానని ఆయన చెప్పారు.
వంగవీటి రంగా హత్య వెనక చంద్రబాబు పాత్ర ఉందని మీరు పుస్తకంలో రాశారు కదా, ప్రభుత్వం మిమ్మల్ని ఎలా నమ్ముతుంది అని అంటే ఇంకా చాలా విషయాలు రాశానని, అది మాత్రమే మాట్లాడితే ఎలా అని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ల సాధనకు తాను, తన భార్య ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ముద్రగడ పద్మనాభం హెచ్చరించిన నేపథ్యంలో వాతావరణం మరింత గంభీరంగా మారింది.
అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముద్రగడను చర్చలకు ఆహ్వానించడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య ఆ ప్రతిపాదన చేశారని అనుకోవచ్చు. అదే సమయంలో పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.