పార్టీ ఎలా: నేతల తలోమాట, తెరాసపై జానా
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు హాజరైన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో సరైన ప్రచారం చేయక పోవడం వల్లనే కాంగ్రెస్ ఓటమి పాలైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా న్యూస్ పేపర్, టీవీ ఛానల్ ఉండాలన్నారు. ఇందు కోసం కాంగ్రెస్ కార్యకర్తలంతా రూ. 1000 విరాళం ఇవ్వాలన్నారు.
అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీలో సోషల్ మీడియా సెల్ ను ఏర్పాటు చేయడంతోపాటు కాంగ్రెస్ నేతలంతా సోషల్ మీడియాని విరివిగా వినియోగించాలన్నారు. గీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంస్దాగత పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేసే తీరుపై పార్టీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: జానా రెడ్డి
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యచరణ సదస్సులో రెండో రోజు తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కె. జానా రెడ్డి మాట్లాడుతూ ప్రజాసమస్యలపై పోరాడతామని రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రుణమాఫీ, దళితులకు భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య, పేదలకు ఇళ్లు వంటి టీఆర్ఎస్ హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్లంలో రైతుల ఆత్మహత్యలు, పంట నష్టం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కరువుతో పాటు విద్యుత్ కోతలు ఎక్కవగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఉన్నవారంతా తెలంగాణ రాష్ట్ర పౌరులేనని... వారికి అన్ని హక్కులుంటాయన్నారు. ప్రభుత్వం వివక్ష చూపిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని, బాధితులకు అండగా ఉంటామన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ ప్రతీకార దాడులకు పాల్పడుతోందని.. ఈ దాడులను ఎదుర్కొంటామన్నారు.
తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ నిలబలడలేదు: చిన్నారెడ్డి
తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ నిలబడలేకపోయిందనే బాధ పార్టీ కేడర్లో ఉందని ఇబ్రహీంపట్నంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సులో మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీతో కలిసి పనిచేయకపోవడం, కాంగ్రెస్ వ్యూహం ఫలించకపోవడం వల్లే పార్టీ ఓటమి పాలైందన్నారు. పార్టీ సంస్దాగత పదవుల్లో మహిళలు, యువతకు పెట్ట పీట వేయాలన్నారు. ఇది ఇలా ఉంటే మరో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎన్నికల హామీలే ఆ పార్టీని గెలిపించాయన్నారు. పార్టీకి తిరిగి పూర్వ వైభవం రావాలంటే నేతలంతా ఐక్యంగా పనిచేయలన్నారు.