మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్కు కరోనా పాజిటివ్: జ్వరం తగ్గకపోవడంతో టెస్ట్ చేస్తే..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇటు నేతలను కూడా వైరస్ వదలడం లేదు. మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కరోనా వైరస్ బారినపడి.. కోలుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కిడారికి కరోనా వైరస్ సోకింది.
కిడారి శ్రావణ్ కుమార్కు గత కొద్దిరోజుల నుంచి జ్వరం వస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చింది. విశాఖపట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నిన్న పరీక్ష చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే ఆస్పత్రిలో చేరి.. చికిత్స తీసుకుంటున్నారు. విశాఖలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగానే ఉంది. జిల్లాలో నిన్న 1096 పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 34 వేల 818కి చేరింది.
ఇటు తనకు కరోనా సోకిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఈ మేరకు ఆయన నిన్న ట్వీట్ చేశారు. 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారని ట్వీట్ చేశారు. వైరస్ సోకినందున, నయమయ్యేవరకు రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. దైవ సమానులైన చంద్రబాబు, అభిమానుల ఆశీస్సులతో కరోనా వైరస్ను జయిస్తానని తెలిపారు. త్వరలోనే రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని వివరించారు. ఇదివరకు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే.
Recommended Video
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్ కూడా వైరస్ బారినపడ్డారు. ఎంపీ విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు, కరణం బలరాం, బియ్యపు మధుసుధన్ రెడ్డి, ఎన్ వెంకటయ్య గౌడ్, ముస్తఫా, అన్నాబత్తుల శివకుమార్, కిలారి రోశయ్య, హఫీజ్ ఖాన్, గంగుల బిజేంద్ర రెడ్డి, అన్నా రాంబాబు, డాక్టర్ సుధాకర్, గొల్ల బాబూరావు, కే. శ్రీనివాసరావు, విశ్వసరాయి కళావతి కరోనా వైరస్ సోకింది. వీరిలో చాలామంది ఇప్పటికే కోలుకున్నారు. మరికొందరు కోలుకోవాల్సి ఉంది.