వైసీపీలోకి మాజీ కేంద్రమంత్రి!: జగన్తో సంప్రదింపులు.. డీల్ కుదరితే త్వరలోనే?
మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వైసీపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టెక్కలి నుంచి టికెట్ ఇవ్వాలని ఇదివరకే ఆమె జగన్ తో సంప్రదింపులు జరిపారట.టెక్కలి సీటు కుదరకపోవడంతో పలాసా నుంచి వైసీపీ
శ్రీకాకుళం: మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వైసీపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడిపోవడంతో ఇంకా అందులోనే కొనసాగడం రాజకీయ భవిష్యత్తును అంధకారం చేసుకోవడమేననే ఆలోచనలో ఆమె ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ తిరిగి పుంజుకునే సూచనలు కూడా కనిపిచంచకపోవడంతో ఇక వైసీపీలో చేరడమే కరెక్ట్ అన్న యోచనలో ఆమె ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తో ఆమె సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు.
విభజన తర్వాత:
రాష్ట్ర విభజనకు ముందు శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. కానీ ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జిల్లాలో టీడీపీ బలం పుంజుకోవడంతో ధర్మాన వంటి నేతలు వైసీపీలోకి మారిపోయారు. అప్పటినుంచి మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలే జిల్లాలో పార్టీకి దిక్సూచిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరి వల్లే శ్రీకాకుళంలో అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
అప్పట్లోనే ప్రచారం:
ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ ను వీడిన రోజుల్లోనే కిల్లి కృపారాణి కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. వైఎస్ కుటుంబంతో ధర్మానకు ఉన్న సాన్నిహిత్యం రీత్యా.. కృపారాణికి వైసీపీలో ప్రాధాన్యం దక్కేలా ఆయన మంతనాలు సాగించారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ అవన్ని అక్కడికే పరిమితమైపోయాయి.
కాగా, టీడీపీలో రాజకీయ దిగ్గజంగా పేరొందిన ఎర్రంనాయుడుపై విజయం సాధించి కిల్లి కృపారాణి కాంగ్రెస్ హైకమాండ్ కు దగ్గరైన సంగతి తెలిసిందే. మన్మోహన్ కేబినెట్ లో కేంద్రమంత్రిగాను ఆమె పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ కన్నా వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా మారడంతో.. చాలామంది ఆ పార్టీలోకి వెళ్లారు. కృపారాణి మాత్రం వేచి చూసే ధోరణితోనే వ్యవహరిస్తూ వస్తున్నారు.
మళ్లీ ఇన్నాళ్లకు:
చాలారోజుల తర్వాత కృపారాణి వైసీపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం మళ్లీ జోరందుకుంది. 2019నాటికి కాంగ్రెస్ పరిస్థితి తీసికట్టుగానే ఉండే అవకాశం ఉండటంతో ఇక అందులో కొనసాగడం కరెక్ట్ కాదని ఆమె నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వైసీపీలోకి వెళ్లాలంటే జగన్ నుంచి కచ్చితమైన హామి రావాల్సిందేనని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. సీటు విషయం పక్కా అయితేనే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారట.
ఎక్కడి నుంచి పోటీ?:
టెక్కలి నిజయోవకర్గంతో తనకున్న అనుబంధం రీత్యా ఆ సీటు తనకివ్వాలని కృపారాణి జగన్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ తరుపున ఇప్పటికే ఇద్దరు నియోజకవర్గ ఇన్ చార్జీలు అక్కడ ఉండటంతో.. వేరే స్థానం గురించి ఆలోచించాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.
జగన్ సూచనతో తన సామాజికవర్గం బలంగా ఉన్న పలాసా నియోజకవర్గం నుంచి పోటీకి దిగాలని కృపారాణి భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం చర్చల దశలోనే ఉండటంతో దీనిపై జగన్ నుంచి పూర్తి సమ్మతం లభించగానే వైసీపీలోకి ఆమె వెళ్తారని టాక్. మొత్తం మీద రేపో మాపో వైసీపీలో కృపారాణి చేరిక మాత్రం ఖాయమంటున్నారు.