Nara Lokesh: నారా లోకేష్కు జగన్ సర్కార్ ఊహించని షాక్: రెండోసారి కూడా.. !
Recommended Video
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్కు జగన్ సర్కార్ అనూహ్య షాక్ ఇచ్చింది. ఇది రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తరువాత అమరావతి ప్రాంత రైతుల ఉద్యమంలో నారా లోకేష్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ఎండగడుతున్నారు.
నారా లోకేష్ దూకుడును నియంత్రించడానికా అన్నట్టు ఆయనకు కల్పిస్తోన్న భద్రతను కుదించింది ప్రభుత్వం. ఇప్పటిదాకా నారా లోకేష్కు కొనసాగిన వై ప్లస్ భద్రతను ఎక్స్ కేటగిరిగా బదలాయించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నారా లోకేష్ భద్రతను కుదించడం ఇది రెండోసారి. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆయనకు జడ్ ప్లస్ భద్రత ఉండేది.
గత ఏడాది జూన్లో దీన్ని కుదించింది ప్రభుత్వం. జడ్ ప్లస్ భద్రతను వై ప్లస్గా మార్చింది. ఎనిమిదినెలల వ్యవధిలో మరోసారి ఆయన భద్రతను కుదించింది. ఎక్స్ కేటగిరిలోకి తీసుకొచ్చింది. దీనిపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. అమరావతి రైతుల ఉద్యమంలో నారా లోకేష్ చురుకుగా వ్యవహరిస్తున్నారని, ఆయన దూకుడును నియంత్రించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం భద్రతను కుదించిందని ఆరోపిస్తున్నారు.