ఇంత జరుగుతున్నా..నారాయణ ఎక్కడ: వైసీపీ నేతలతో టచ్లోకి : పార్టీలోకి రాకుండా ఆ మంత్రే అడ్డు..!
మాజీ మంత్రి నారాయణ ఎక్కడ ఉన్నారు. కొంత కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇక, టీడీపీలోనూ యాక్టివ్గా లేరు. ఇప్పుడు ప్రజా వేదిక గురించి రచ్చ జరుగుతుంటే..దీని నిర్మాణంలో సూత్రధాని మాజీ సీఎం చంద్రబాబు అయినా..ప్రధాన పాత్రధాని నారాయణ. ఇదే అంశం పైన చంద్రబాబు వద్ద కీలక సమావేశం జరుగుతుంటే దానికీ దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. నారాయణ టీడీపీ వీడి వైసీపీ వైపు చూస్తున్నట్లుగా స్పష్టమైన సమాచారం. అయితే, ఆయన రాకకు మంత్రి ఒకరు అడ్డుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు నారాయణ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి.. ఏం జరుగుతోంది..
నారాయణ ఎక్కడున్నారు..
ఏపీ రాజధాని అమరావతి కరకట్ట మీద అక్రమ నిర్మాణాల మీద రెండు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజా వేదికను ప్రస్తుత ప్రభుత్వం కూల్చేసింది. మిగిలిన నిర్మాణాల సంగతి ఎలా ఉన్నా..ఈ ప్రజా వేదిక నిర్మాణానికి సూత్రధాని చంద్రబాబు అయితే..నిర్మాణ పాత్రధాని నాటి మంత్రి నారాయణ. ఇక, ఇంత రగడ జరుగుతున్న నారాయణ బయటకు రాలేదు. స్పందించలేదు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే ప్రధాన అంశంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా.నారాయణ హాజరు కాలేదు. ఆయన కొంత కాలంగా నెల్లూరు జిల్లాతో సహా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తాజా ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన స్థానికంగా ఉన్న పార్టీ నేతలను నమ్మి ఎన్నికల కోసం పెద్ద ఎత్తున నగదు ఇచ్చినా..వారు అది చేరాల్సిన చోటుకు చేర్చకుండా మోసం చేసారని నారాయణ పార్టీ అధినేత వద్దే ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. నాటి నుండి నారాయణ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
జగన్ దూకుడుతో బెంబేలు..
మంత్రి నారాయణ కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు..ప్రధానంగా రాజధాని కేంద్రంగా జగన్ దూకుడు చూసిన తరువాత నారాయణ మరింత అప్రమత్తం అయినట్లుగా కనిపిస్తోంది. తాజా ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు..ఒక్క లోక్సభ వైసీపీ గెలిచింది. దీంతో..జిల్లాలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బంది లేకుండా సాగిన నారాయణ విద్యా సంస్థల పైనా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. అదే సమయంలో రాజధానిలో భూముల కొనుగోళ్లు..భూ ఒప్పందాలు.. కేటాయింపుల పైనా విచారణకు జగన్ సిద్దం అవుతున్నారు. దీంతో..నాడు మున్సిపల్ శాఖా మంత్రిగా నారాయణ వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుందనే వాదన బలంగా ఉంది. నారాయణ సంస్థల్లో పని చేసే వారి పేర్లతోనూ మంత్రి గా నాడు నారాయణ భూములు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు కోటరీలో కీలక నేతలు సైతం బీజేపీలో చేరటంతో నారాయణ సైతం అప్రమత్తమయ్యారు.
వైసీపీ వైపు నారాయణ చూపు..ఆ మంత్రే అడ్డు..
రాజకీయంగా..ఆర్దికంగా అష్ట దిగ్బంధం అయిన మాజీ మంత్రి నారాయణ టీడీపీ వీడాలని నిర్ణయించినట్లు విశ్వస నీయ సమాచారం. ఇప్పటికే బీజేపీలో చేరిన ఆ నలుగురితో పాటుగా ముఖ్యమంత్రి జగన్తో సన్నిహితంగా ఉండే ఓ ఎంపీతోనూ టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణ వైసీపీలోకి రావటానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నారాయణ వైసీపీలోకి రావటానికి అడ్డంకులు లేవు. ఆయన ఏ పదవిలో లేకపోవటంతో..ఎటువంటి రాజీనామాలు అవసరం లేదు. అయితే, నారాయణ వైసీపీలోకి రావటానికి ఏకైక అడ్డంకి నెల్లూరు జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తాజా ఎన్నికల్లో అనిల్ మాజీ మంత్రి నారాయణ పైనే విజయం సాధించారు. అయితే, అక్కడ ఇద్దరికీ రాజకీయంగా ఉన్న విబేధాలే కారణంగా తెలుస్తోంది. అయితే, రాజధాని పైన సమీక్ష..అవినీతి పైన అంచనా.. బాధ్యులు ఎవరనే దాని పైన స్పష్టత వచ్చిన తరువాత జగన్..మాజీ మంత్రి పార్టీలో ఎంట్రీ పైన ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.