భూమా అఖిలప్రియ కొత్త ఇన్నింగ్స్.. సినీ రంగంలోకి మాజీ మంత్రి.. ఏవీతో వివాదాల తర్వాత..
దివంగత భూమా నాగిరెడ్డి-శోభల రాజకీయవారసురాలిగా.. కర్నూలు జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తోన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయి ఒకింత డీలాపడిన ఆమె.. తన తండ్రి అనుచరుడైన ఏవీ సుబ్బారెడ్డితో విబేధాల కారణంగా తరచూ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం అఖిల సినీ రంగంలోకి ఎంటరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. భర్త భార్గవ్ తో కలిసి ఓ ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించనున్నట్లు సినీ, రాజకీయ వర్గాల ద్వారా వెల్లడైంది.
కరోనాతో బ్రేక్..
భూమా ఫ్యామిలీ రాజకీయ వారసురాలిగా.. 2014లో ఆళ్ళగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో అఖిలప్రియ వైసీపీ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనతరం టీడీపీలోకి ఫిరాయించి, టూరిజం శాఖకు మంత్రి కూడా అయ్యారు. అయితే, 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు. ఎన్నికలము ముగిసిన కొద్ది నెలలకే సినీ రంగంలోకి ప్రవేశంపై ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక రంగంలోకి దిగుదామని భావించేలోపే కరోనా వైరస్ ముంచుకురావడంతో ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
చంద్రబాబు బకాయి తీర్చిన జగన్.. ఇకపై ఏపీలో సమూల మార్పులు.. రైతులకు గుడ్ న్యూస్..
బడా నిర్మాతలే బెంబేలు..
దాదాపు మూడు నెలల తర్వాత ఏపీ, తెలంగాణలో సినిమా, సీరియల్స్ షూటింగ్స్ పున: ప్రారంభం కావడంతో పని గాడిలో పెట్టాలని అఖిలప్రియ భావిస్తున్నట్లు సమాచారం. భర్త భార్గవ్తో కలిసి ఆమె ఏర్పాటు చేయబోయే నిర్మాణ సంస్థకు తల్లిదండ్రుల పేర్లు కలిసొచ్చేలా నామకరణం చేస్తారని వినికిడి. కాగా, కరోనా దెబ్బకు యావత్ సినీ రంగమే కుదేలైపోవడం, 100 రోజులు దాటినా సినిమా థియేటర్లు తెరుచుకోని ప్రస్తుత తరుణంలో బడా నిర్మాతల సినిమాలే సందిగ్ధంలో పడిపోయాయి. ఈసమయంలో అఖిలప్రియ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకోవడం ఆసక్తికరంగా మారింది.
మళ్లీ విచారణకు వైసీపీ నేత పీవీపీ డుమ్మా.. సీఎం జగన్ సరికొత్త ఎత్తుగడపై ఆసక్తికర వ్యాఖ్యలు..
రెండు పడవల ప్రయాణం?
భూమా అఖిలప్రియ సినీ నిర్మాతగా కొత్త కెరీర్ ఆరంభించబోతున్నారన్న వార్తలు కర్నూలు జిల్లా సహా ఏపీ అంతటా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీకి చెందిన కీలక నేతలు ఒక్కక్కర్నీ అధికార వైసీపీ వరుసగా టార్గెట్ చేస్తూ వస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో భూమా వారసురాలి నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, రాజకీయాల్లో ఉంటూనే సినీ రంగంలోనూ పనిచేయాలన్న ఆమె ఆలోచన రెండు పడవలపై ప్రయాణంలా మారుతుందా? లేక సమర్థవంతంగా నిర్వహిస్తారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. మరోవైపు..
Recommended Video
ఏవీతో తీవ్ర విబేధాలు
ఈ ఎన్నికల తర్వాత జగన్ హవాలో టీడీపీ నేతల ప్రభ క్రమంగా తగ్గిపోతున్న తరుణంలోనే ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి అఖిలప్రియకు మధ్య వివాదాలు తారా స్థాయికి చేరాయి. అఖిలప్రియ, ఆమె భర్తతో కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నారంటూ ఏవీ సుబ్బారెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. జూన్ మొదటి వారంలో ఈ మేరకు ఆయన చేసిన ఫిర్యాదులో అఖిలను ఏ4గా పేర్కొన్నప్పటికీ.. పోలీసుల నుంచి ఆమెకు ఎలాంటి నోటీసులు వెళ్లలేదని తేలింది. సుబ్బారెడ్డి వెనుక వైసీపీ ఉందని తాను భావించడంలేదని, వివాదాలకు కారణం స్థానిక టీడీపీ నేతల తీరేనని అఖిలప్రియ చెప్పడం గమనార్హం.