నిన్న ధర్మాన.. నేడు సోమిరెడ్డి, జిల్లాల విభజనపై వ్యతిరేక స్వరం, 150 కి.మీ వెళ్లాల్సి వస్తోందట..
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన అంశంపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బాహాటంగానే వ్యతిరేకించారు. ఆ తర్వాత మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వరం కలిపారు. జిల్లాల విభజన అవసరం లేదు అని.. అందులో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. ఈ విషయంపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు అభిప్రాయంతో ఏకీభవించారు. లోక్సభ నియోజకవర్గం ఒక జిల్లా చేయడం అర్థరహితం అని.. దీంతో కొన్ని గ్రామాలకు దూరం పెరుగుతోందని తెలిపారు. ప్రజల మేలు కోరి మంచి నిర్ణయం తీసుకోవాలని.. ఏదో చేయాలని ముందడుగు వేయొద్దన్నారు.
పెద్ద జిల్లాలు మాత్రం..
జిల్లాల విభజన గురించి సోమిరెడ్డి ప్రభుత్వానికి సూచనలు కూడా చేశారు. విజయనగరం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం జిల్లాలను విభజించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అనంతపురం, చిత్తూరు, కృష్ణ, గుంటూరు, విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాలు వైశాల్య పరంగా పెద్దగా ఉన్నందున.. విభజించాల్సిన ఫరవాలేదన్నారు. అయితే 2026 ఏడాదిలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని సోమిరెడ్డి గుర్తుచేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల హద్దు మారిపోతాయని.. అప్పుడు మళ్లీ జిల్లాలుగా మారుస్తారా అని ప్రశ్నించారు.
మండలాలుగా మార్చడంతో..
1985కి ముందు ఉన్న పంచాయతీ సమితిలు పాలనాపరంగా సౌలభ్యంగా ఉండేవి కావు అని సోమిరెడ్డి చెప్పారు. సమితి పరిధిలోని గ్రామాలకు, కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరం ఉండేదన్నారు. దానిని గమనించిన సీఎం ఎన్టీ రామారావు సమితులను రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. దీంతో పాలన సులభమయ్యిందని, ఇవాళ్టికీ కూడా మండలాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. ప్రజలకు పరిపాలన చాలా సులభమయ్యిందని పేర్కొన్నారు. ఇప్పుడు లోక్ సభ నియోజకవర్గాల మాదిరిగా కాకుండా.. అవసరమనుకున్న చోట విభజించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను అతిగా చేసి.. ప్రాముఖ్యం లేకుండా చేశారని తెలిపారు. జిల్లా అంటే ఒక విలువ ఉండాలని చెప్పారు.
ప్రాముఖ్యం కోల్పోనున్న నెల్లూరు
నెల్లూరు లోక్ సభ నియోజకవర్గాన్ని విభజిస్తే కృష్ణపట్నం పోర్టు, షార్, శ్రీసిటీ తిరుపతి జిల్లా పరిధిలోకి వెళతాయని చెప్పారు. దీంతో నెల్లూరు తన ప్రాముఖ్యతను కోల్పోతుందని వివరించారు. తన స్వస్థలం అల్లిపురం నెల్లూరు నగరపాలక సంస్థలో ఉందన్నారు. నెల్లూరు కలెక్టరేట్కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగా.. పొరుగున ఉన్న నరుకూరు, చిన్నచెరుకూరు తిరుపతి జిల్లా పరిధిలోకి వెళతాయని చెప్పారు. ఆ గ్రామాల ప్రజలు తిరుపతి కలెక్టరేట్కి వెళ్లాలంటే నెల్లూరును దాటి 150 కిలోమీటర్లు ప్రయాణించాలన్నారు. దీనిని బట్టి ప్రజలకు ఉపయోగపడేలా జిల్లాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
ధర్మాన ఇలా..?
జిల్లాల పునర్విభజన అంశాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తప్పుపట్టారు. పార్లమెంట్ నియోజకవర్ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. శ్రీకాకుళం జిల్లాను విడదీస్తే రాజకీయంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అంతేకాదు నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన ప్రతీసారి విభజించడం లేదు కదా అన్నారు. శ్రీకాకుళం జిల్లా అముదాలవసలలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. అయితే వేదికపై ధర్మాన సోదరుడు, మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎంపీ విజయసాయిరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం ఉండగా కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Recommended Video
ఆ జిల్లాలివే..?
ఉత్తరాంధ్రలో విశాఖపట్టణంతో అదనంగా అనకాపల్లి, అరకు జిల్లాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. తూర్పు గోదావరి జిల్లా మూడుగా చీలనుంది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలుగా మారే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి జిల్లా రెండుగా చీలి... ఏలూరు, నర్సాపురం జిల్లాలుగా, కృష్ణా జిల్లా నుంచి విజయవాడ, మచిలీపట్నం జిల్లాలు, గుంటూరు నుంచి అదనంగా బాపట్ల, నర్సారావుపేట జిల్లాలు, చిత్తూరు నుంచి అదనంగా తిరుపతి, కడప నుంచి అదనంగా రాజంపేట, కర్నూలు నుంచి అదనంగా నంధ్యాల, అనంతపురం నుంచి అదనంగా హిందూపురం జిల్లాలు ఏర్పడబోయే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో గల గిరిజన ప్రాంతాల్ని కలుపుతూ ఏర్పడే అరకు నియోజకవర్గాన్ని ట్రైబల్ జిల్లాగా ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో మాజీమంత్రులు ధర్మాన, సోమిరెడ్డి వ్యతిరేక గళం వినిపిస్తున్నారు.