మాజీలకు భద్రత కుదింపు: ఏపీలో 250, టీలో 181
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు మాజీ మంత్రులకు, నేతలు వ్యక్తిగత భద్రతను కుదించారు. ఇరు రాష్ట్రాల్లోని జిల్లాల ఎస్పీలు ఇచ్చిన నివేదిక ప్రకారం ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రాణహాని ఉండటంతో గత కొన్నేళ్లుగా బుల్లెట్ప్రూఫ్ వాహనం కూడా ఉంది.
ప్రస్తుతం ఆయనకు సెక్యూరిటీ తగ్గించగా.. ఆయన గన్మన్లను సైతం వెనక్కి పంపిన విషయం తెలిసిందే. మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్గౌడ్ , టీడీపీపీ మాజీ నేత నామా నాగేశ్వర రావుకు గన్మన్లను తగ్గించారు. ఆంధ్రప్రదేశ్లో పలువురు మాజీ మంత్రులకు గన్మన్లతోపాటు బుల్లెట్ప్రూఫ్ వాహనాలను తొలగించారు.
రెండు రాష్ట్రాల్లో మొత్తం 430 మంది మాజీ ఎమ్మెల్యేలు, వీఐపీలకు గన్మన్లను పూర్తిగా తొలగించారని తెలుస్తోంది. తెలంగాణలో 500 మందికి గన్మన్లు ఉండగా వారిలో 181మందికి, ఆంధ్రప్రదేశ్లో 600 మందికి అంగరక్షకులుండగా వారిలో 250 మందికి ఉపసంహరించారు.
తెలంగాణలో సెక్యూరిటీ తొలగించబడ్డ వారిలో 38 మంది నేతలు ఉన్నారు. అందులో ఎర్రబెల్లి, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రా రెడ్డి తదితరులు ఉన్నారు. ముఖేష్ గౌడ్, దానం నాగేందర్లకు కూడా సెక్యూరిటీని తొలగించారు. ఏపీలో కన్నా లక్ష్మీ నారాయణ బుల్లెట్ ప్రూఫ్ కారును వెనక్కి తీసుకున్నారు. మాజీలు, వీఐపీలకు ఇద్దరు గన్మెన్లు మాత్రమే ఉంటారు. గన్మన్ల ఉపసంహరణ, తగ్గింపుపై తెలంగాణ, ఏపీల్లో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.