వైఎస్ఆర్ సీపీలో చేరిన దేవినేని: జనసేనకు గుడ్ బై! టీడీపీతో కుమ్మక్కే కారణమా?
గుంటూరు: తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జున రావు పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. వైఎస్ జగన్ ఆదివారం జిల్లాలోని రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లారు. దేవినేని మల్లికార్జున రావు అక్కడే జగన్ ను కలిసి, పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనితో జగన్.. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పెట్రోల్ ,డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం ఎన్డీఏ పై ఉంటుందా ?
నిజానికి- దేవినేని మల్లికార్జున రావు దాదాపు అన్ని పార్టీల్లోనూ తిరిగారు. కాంగ్రెస్ తో తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 2004 ఎన్నికల్లో ఆయన రేపల్లె నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. 2009లో టికెట్ దక్కలేదు. దీనితో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రేపల్లె టికెట్ ను ఆశించారు. అయినప్పటికీ- ఆయనకు టికెట్ దక్కలేదు. దీనితో నిరాశకు గురైన మల్లికార్జున రావు కొద్దిరోజుల కిందటే జనసేన పార్టీలో చేరారు.
ఆయనకు గుంటూరు జిల్లాలోని వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది. ఆయన మద్దతు ఇచ్చిన నాయకులు గత ఎన్నికల్లో గెలుపొందారు. జనసేన పార్టీలో చేరారు. అక్కడ కూడా ఆయనకు టికెట్ దక్కలేదు. రేపల్లె నుంచి జనసేన పార్టీ టికెట్ దక్కుతుందని ఆశించినప్పటికీ.. చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ దేవినేని అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టారు. పామర్రు టికెట్ అయినా తనకు కేటాయించాలని ఆయన పవన్ కల్యాణ్ ను కోరగా.. అదీ ఫలించలేదు. దీనితో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా టీడీపీతో కుమ్మక్కు కావడం వల్లే పవన్ కల్యాణ్ తనకు టికెట్ ఇవ్వలేదని దేవినేని ఆరోపిస్తున్నారు. బలహీనమైన అభ్యర్థులను పోటీలో దింపుతున్నారని విమర్శించారు.