దేవస్థానం భూములు ఆక్రమణకు మాజీ ఎమ్మెల్యే యత్నం...అడ్డుకున్నఅధికారులు
విశాఖపట్నం: సింహాచలం దేవస్థానానికి చెందిన భూములను ఆక్రమించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారామ్ చేసిన యత్నాన్నిఅధికారులు అడ్డుకున్నారు. అడవివరం పంచాయతీ పరిధి లోని సర్వే నెంబర్ 13లో సింహాచలం దేవస్థానానికి చెందిన సుమారు ఐదు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారామ్ ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు దేవస్థానం అధికారులకు సమాచారం అందడంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
దీంతో ఈవో రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు భూపరిరక్షణ విభాగం సహాయ కార్యనిర్వాహణాధికారి ఎంవీ కృష్ణమాచార్యులు సిబ్బందితో ఆక్రమిత ప్రాంతానికి వెళ్లారు. అక్కడ దేవస్థానం భూమి అక్రమించేందుకు ప్రయత్నం జరుగుతోందని నిర్ధారించుకున్నారు. అక్కడ భూమి స్వరూపాన్ని మార్చేందుకు గత వారం రోజులుగా ప్రయత్నం జరుగుతున్నట్టు, దాన్ని ఒక లే అవుట్ లా మార్చే యత్నం జరుగుతున్నట్లు గుర్తించారు. అందుకోసమే రహదారి నిర్మాణం, చుట్టూ పోల్స్, విద్యుత్ కనెక్షన్, బోర్వెల్ ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడంతో అధికారులు వాటిని తొలగించే పనులు చేపట్టారు.
ఆక్రమణను అడ్డుకునేందుకు వారు...వారిని అడ్డుకునేందుకు మాజీ ఎమ్మెల్యే...
అధికారులు ఎక్స్కవేటర్ సాయంతో దేవస్థానం స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారాన్ని తొలగించి, తర్వాత స్థలం చుట్టూ ఫెన్సింగ్ పోల్స్ తీయించే పనులు ప్రారంభించారు. అయితే దేవాదాయ శాఖ అధికారులు ఇలా ఆక్రమణలు తొలగిస్తున్న విషయం తెలుసుకున్నభీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారామ్ అక్కడకు చేరుకుని ఆక్రమణలు తొలగించకుండా ఎక్స్కవేటర్కు అడ్డుగా పడుకున్నారు.
అధికారులతో మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం...
అయితే అది దేవస్థానానికి సంబంధించిన స్థలమని అధికారులు మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాంకు సర్ధి చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కర్రి సీతారాం ఏఈవో కృష్ణమాచార్యులతో వాగ్వాదానికి దిగారు. దేవస్థానం స్థలాల్లో వున్న అన్ని ఆక్రమణలు తొలగించకుండా నేరుగా తమ స్థలాల్లోకి రావడం సరికాదని హెచ్చరించారు. తాను ఆ భూములకు మూడు దశాబ్దాలుగా కౌలుదారుడిగా వున్నానని వాదించారు. అయితే దేవస్థానం రికార్డుల ప్రకారం చూస్తే గత 30 ఏళ్లుగా ఆ భూములను ఏటా వేలం వేస్తూ రైతులకు కౌలుకు ఇస్తున్నట్లుగా ఉంది.
మాజీ ఎమ్మెల్యే కు...ఎలా సంబంధం అంటే...
అయితే ఈ దేవస్థానం భూమిని అలా కౌలుకు తీసుకున్నఒక వ్యక్తి నుంచి 1990లో తాను కొనుగోలు చేసినట్లు ఉన్న పత్రాలను మాజీ ఎమ్మెల్యే చూపిస్తున్నారు. ఆ పత్రాల ఆధారంగానే ఆయన ఆ భూములను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో...దేవస్థానం అధికారులు నిబంధనల ప్రకారం ఆ కొనుగోలు చెల్లదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం కౌలు భూములు వేరొకరికి విక్రయించేందుకు వీలు లేదని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు దేవస్థానం భూములను కనీసం స్వరూపం మార్చే హక్కు కూడా లేదని తేల్చి చెప్పేశారు.
ఆ భూమి విలువ...25 కోట్ల రూపాయలు...
మార్కెట్ విలువ ప్రకారం ఈ స్థలం విలువ సుమారు రూ.పాతిక కోట్లకు పైగా ఉంటుంది. ఈ భూమిని 2017 వరకు పలువురు రైతులకు కౌలుగా ఇస్తున్నట్లు దేవస్థానం రికార్డుల్లో రాసి ఉండటం గమనార్హం. ఈ విషయమై ఈవో కోడూరి రామచంద్రమోహన్ మాట్లాడుతూ కోట్లాది రూపాయలు విలువచేసే భూమిని ఆక్రమించేందుకు మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారామ్ యత్నించారన్నారు. అందుకే దేవస్థానం స్థలం చదును చేయడం, దాని చుట్టూ కంచె వేయడం, మౌలిక వసతులు కల్పించడం చేశారని...ఇవన్నీ స్థలాన్ని ఆక్రమించుకునే పథకంలో భాగమేనని స్పష్టం చేశారు. ఆ భూమిపై సింహాచలం దేవస్థానానికి పూర్తి హక్కులు ఉన్నాయని, అందుకే ఆక్రమణలు తొలగించడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఆక్రమణలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఈవో స్పష్టం చేశారు.