టీడీపీకి మరో కీలక నేత గుడ్ బై: వైసీపీలోకి ఎంట్రీ: విజయ దశమి నాడు మరిన్ని చేరికలు..!
విజయ దశమి ముహూర్తానికి రాజకీయంగా జంపింగ్ లకు నేతలు సిద్దం అవుతున్నారు. కొద్ది రోజులుగా పార్టీ మార్పు పైన తర్జన భర్జన పడుతున్న నేతలు ఇప్పుడు ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు. అందులో బాగంగా వైసీపీ వ్యూహాత్మకంగా ముందుగా విశాఖ మీద ఫోకస్ చేసింది. అందులో భాగంగా అక్కడ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి సోదరుడి చేరిక మీద చర్చలు సాగుతున్నాయి. ఇక..మాజీ మంత్రి సైతం ఊగిసలాటలో ఉన్నారు. ఆయన రాక పైన ప్రస్తుత మంత్రి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి తాను ప్రస్తుతం ఉన్న పదవికి సైతం రాజీనామా చేయటానికి సిద్దమయ్యరు. తాజాగా జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. వైసీపీ ముఖ్య నేతలతో మంతనాలు పూర్తి చేసారు. విజయ దశమి నాడు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరాలని నిర్ణయించారు. ఆయనతో పాటుగా విశాఖ నగరానికి చెందిన మరో ఇద్దరు ముఖ్య నేతలు సైతం పార్టీలో చేరుతారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
వైసీపీలోకి పంచకర్ల రమేష్ బాబు..
టీడీపీ నేత..మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరటం దాదాపు ఖాయమైంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు..ఆ తరువాత టీడీపీలో స్థానికంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తొలుత బీజీపీలో చేరాలని భావించారు. అయితే, ఆయన తొలి నుండి మాజీ మంత్రితో సన్నిహితంగా ఉంటున్నారు.
ఆయన సూచనల మేరకే వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా..పంచకర్ల చినముషిడివాడలోని శారదా పీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర సరస్వతిని దర్శించుకున్నట్టు ఆయన ముఖ్య అనుచరులు పేర్కొంటున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన ఎలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యకాలాపాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. పార్టీ రూరల్ అధ్యక్షునిగా నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో రూరల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
విజయ సాయిరెడ్డితో మంతనాలు..
2009లో ప్రజారాజ్య పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పంచకర్ల రమేష్ బాబు తొలి ఎన్నికల్లో పెందుర్తి నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్.. ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం ప్రజారాజ్యం నుండే గెలుపొందారు. ఆ తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయింది. 2014 ఎన్నికల సమయంలో గంటా..అవంతి తో పాటుగా పంచకర్ల సైతం టీడీపీ కండువా కప్పుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో పంచకర్ల రమేష్ ఎలమంచిలి నుండి పోటీ చేసి గెలుపొందారు. అవంతి శ్రీనివాస రావు టీడీపీ నుండి ఎంపీగా..గంటా ఎమ్మెల్యేగా గెలిచారు.
గంటా మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల సమయం వరకు వీరు ఒక్కటిగానే ఉన్నారు. అవంతి వైసీపీలో చేరి భీమిలి నుండి పోటీ చేసి ఎమ్మెల్యే అయి..ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన తాజాగా సీఎం జగన్ అనుమతిస్తే టీడీపీ నుండి వైసీపీలో చేరటానికి పది మంది సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక..ఇప్పుడు పంచకర్ల వైసీపీలో చేరే అంశం పైన ఇప్పటికే వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ద్వారా ఆ పార్టీలో చేరేందుకు సంప్రతింపులు జరుపుతున్నట్టు సమాచారం. దీంతో..ఆయన వైసీపీలో చేరటానికి ముహూర్తం సైతం సిద్దం చేసుకున్నారు.
విజయ దశమి నాడు వైసీపీలోకి ఎంట్రీ..
వైసీపీ అధినేత..ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీలోకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో విజయ దశమి నాడు వైసీపీలో చేరాలని పంచకర్ల నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన తో పాటుగా విశాఖ నగరానికి చెందిన మరో ఇద్దరు కీలక నేతలు సైతం వైసీపీలో చేరుతారని సమాచారం. ఇదే సమయంలో మాజీ మంత్రి..ప్రస్తుత ఎమ్మెల్యేగా టీడీపీలో కొనసాగుతున్న నేత సైతం పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం ప్రస్తుతం ఆయన పదవిని సైతం వదులుకోవటానికి సిద్దమయ్యారు.
అయితే..ఇదే జిల్లా నుండి మంత్రిగా ఉన్న నేత సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఆ ఇద్దరి మధ్య రాజకీయంగా విమర్శలు వేడి పుట్టిస్తున్నాయి. అయితే..ఎలాగైనా విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయాలని వైసీపీ పట్టుదలతో ఉంది. తాజాగా జరగిన ఎన్నికల్లోనూ నగరంలోని నాలుగు సీట్లు మినహా మిగిలిన సీట్లు వైసీపీ గెలిచింది. దీంతో..ఈ పట్టు కొనసాగిస్తూ గ్రేటర్ విశాఖ ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. దీంతో..విజయ దశమి నాడు పలువురు కీలక నేతలు వైసీపీలో చేరుతారని పార్టీ నేతలు చెబుతున్నారు.