టీడీపీకి షాక్: రేపే వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి
Recommended Video
విజయవాడ: తెలుగుదేశం పార్టీకి ఇదో షాక్ లాంటిదే. ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. స్వయంగా అధినేత చంద్రబాబు పిలిచి బుజ్జగించినా.. పార్టీ మార్పు విషయంలో ఆయన వెనక్కి తగ్గలేదు.
టీడీపీలో సరైన గౌరవం దక్కకపోవడం వల్లే తాను పార్టీ మారుతున్నట్టు ఆయన చెబుతున్నారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ వారధి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో తాను ఆ పార్టీలో చేరుతున్నట్టు తాజాగా ఆయన ప్రకటించారు.
2014లో తాను సిట్టింగ్ ఎమ్మెల్యేను అయినప్పటికీ, సీటు ఇవ్వకుండా అవమానించారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇన్నాళ్లు ఓపిగ్గా ఎదురుచూసిన తనకు ఒరిగిందేమి లేదని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ వీడుతున్న సందర్భంగా.. తానెవరినీ విమర్శించడం లేదని, తన వెంట ఉన్న కార్యకర్తల అభీష్టం మేరకే జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అలాగే తన రాకతో విజయవాడలోని ఏ వైసీపీకి నేతకూ ఇబ్బంది కలగకూడదని భావిస్తున్నట్టు చెప్పారు.
'2009లో ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఆ తర్వాత టీడీపీలో చేరాను. ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తున్నా. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అనడంతో యువత నిరుత్సాహ పడ్డారు. 2004, 2014లో నన్ను భంగపడేలా చేశారు. 2014 నుంచి అవకాశం రాకపోయినా పార్టీలో ఉన్నాను. కొందరి చర్యల కారణంగా నేను పార్టీలో ఉన్నానో లేదో నాకే అర్థం కాలేదు. దీంతో నేను మనస్తాపం చెందాను' అని యలమంచిలి రవి చెప్పుకొచ్చారు.
కొంతమంది మంత్రులు తనను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు బాధించాయని అన్నారు. రైతు గర్జన సమయంలో కూడా తమను ఉపయోగించుకుని, సీటు ఇస్తానని హామి ఇచ్చి మోసం చేశారని గుర్తుచేశారు.