వాస్తు శిల్పి, మాజీ ఎంపీ బిఎన్ రెడ్డి కుమారుడు ఆత్మహత్య
హైదరాబాద్: వాస్తు శిల్పి, మిర్యాలగూడ మాజీ ఎంపి బిఎన్ రెడ్డి కుమారుడు బి చంద్రశేఖర్రెడ్డి (57) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఇంట్లో 3.2 లైసెస్డ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య శాలిని రెడ్డి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం భార్య శాలిని భోజనం చేసి భర్త చంద్రశేఖర్రెడ్డి గదికి వెళ్లి చూడగా అప్పటికే ఆయన తుపాకీతో కాల్చుకుని బెడ్పై పడి ఉన్నారు.
హుటాహుటిన కుటుంబ సభ్యులు చంద్రశేఖర్రెడ్డిని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిచారు. ఇలా ఉండగా చంద్రశేఖర్రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పోలీసులు చెప్పారు. ఆ కారణంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
చంద్రశేఖర్రెడ్డి కుటుంబం హైదరాబాద్ నందిగిరి హిల్స్లో నివాసం ఉంటుంది. కాని ఆయన తన మామ, పూర్వ ఐపిఎస్ అధికారి శ్రీకాంత్రెడ్డి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా పోలీసులే మరో కథనాన్ని చెబుతున్నారు. గత కొంత కాలంగా చంద్రశేఖర్ రెడ్డి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, పది రోజుల క్రితం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తన మామ పూర్వ ఐపిఎస్ అధికారి శ్రీకాంత్రెడ్డి ఇంటికి వచ్చారని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న ఆయన అది తాళలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసులో వాస్తవాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి. పోలీసులు పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.