కొజ్జాలతో కాదు.. దమ్ముంటే మగాళ్లలా రండి.. సీఎం అయ్యాక కూడా అడుక్కుతినే ఆలోచనలేనా?:జగన్పై జేసీ ఫైర్
'సేవ్ అమరావతి' ఉద్యమాన్ని అన్ని జిల్లాల్లోనూ రగిల్చే ప్రయత్నాలను టీడీపీ ముమ్మరం చేసింది. మొదట అమరావతి సహా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను చేపట్టిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు.. తర్వాత తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. సోమవారం సీమ జిల్లాల పర్యటనకు వెళ్లనున్న ఆయన.. అనంతపురంలో ర్యాలీలు, సభలు నిర్వహించనున్నారు. చంద్రబాబు అనంత పర్యటన నేపథ్యంలో సీఎం జగన్, పోలీసులను ఉద్దేశించి టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు.
కచ్చితంగా వెళతా..
చంద్రబాబు జిల్లాల పర్యటనలో స్థానిక టీడీపీ నేతల్ని పాల్గొననీయకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని జేసీ తప్పుపట్టారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని హౌజ్ అరెస్టులు చేస్తోన్న తీరుపై మండిపడ్డారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను అనంతపురంలో జరిగే చంద్రబాబు పర్యటనలో పాల్గొని తీరుతానని జేసీ చెప్పారు. శాంతియుత నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తోందన్నారు.
మగతనం ఉంటే..
అమరావతి ఉద్యమం దెబ్బకి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు వణుకు మొదలైందని, సెక్యూరిటీ లేకుండా జనంలోకి వెళ్లే సాహసం చేయడంలేదని జేసీ అన్నారు. ‘‘వైసీపీ నేతలకు నేను ఒకటే సవాలు విసురుతున్నా.. మీకు నిజంగా మగతనం ఉంటే.. పోలీసులు లేకుండా ప్రజల్లోకి రావాలి. అంతేగానీ కొజ్జాలను అడ్డం పెట్టుకుని అందర్నీ చావగొట్టడం ఎంతవరకు సమంజసం?''అని ప్రశ్నించారు.
జగన్ నన్నేమీ..
సీఎం జగన్ తో తీవ్రస్థాయిలో వైరం కొనసాగుతోందని, రాజకీయ కక్షతోనే రకరకాల రీతుల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ తెలిపారు. ‘‘రాజకీయంగా జగన్ నన్నేమీ చేయలేడు. అందుకే ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాడు. ఆయన పైకి ఎదిగాడు.. సీఎం అయిన తర్వాత కూడా రోడ్డు మీద అడుక్కుతినేవాడిలా ఆలోచిస్తే ఎలా?‘‘ అని మండిపడ్డారు.
కడపలో రాజధాని పెట్టాలి..
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, అలా కాకుండా జగన్ పిల్లచేష్టలు చేస్తే.. గ్రేటర్ రాయలసీమ డిమాండ్ తో తిప్పికొడతామని, కడపలో రాజధాని పెట్టాలని సూచిస్తానని జేసీ చెప్పారు. అమరావతి ప్రాంతంలో గడిచిన 70 ఏండ్లలో ఒక్కసారి కూడా వరదలు రాలేదని, కేవలం కులా మధ్య చిచ్చలు పెట్టడానికే సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని జేసీ ఆరోపించారు.