సబ్బం హరికి పిలువు: బిజెపిలోకి కణితి విశ్వానాథం
విశాఖపట్నం: మాజీ పార్లమెంటు సభ్యుడు కణితి విశ్వనాథం బీజేపీలో చేరారు. శుక్రవారం బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి సమక్షంలో విశ్వనాథం బిజెపిలో చేరారు. కాశీబుగ్గలో జరిగిన ఈ కార్యక్రమంలో కణితి తనయుడు రాజేంద్ర, ఆయన అనుచరులు అధిక సంఖ్యలో బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ సమర్ధవంతమైన పరిపాలనకు ఆకర్షితులై అనేకమంది నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని హరిబాబు అన్నారు.
కణితి చేరికతో శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి మంచి వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పి.మాణిక్యాలరావు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ముఖ్యనేతల వరస చేరికలతో బీజేపీలో ఉత్సాహం కనిపిస్తోంది. వేర్వేరు కారణాలతో అసంతృప్తితో ఉన్న నేతలను ఆకర్షించడంలో ఆ పార్టీ వ్యూహం క్రమంగా ఫలిస్తున్నట్టు కనిపిస్తున్నది.
రెండు రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు విశాఖపట్నంలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. బిజెపిలో చేరాలని ఆయన సబ్బం హరిని ఆహ్వానించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని నిర్ణయించుకొని బయటకొచ్చానని, ప్రజా సేవకు వీలుగా ఉంటుందని బీజేపీలో చేరానని కావూరి వివరించినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో బంధం ఎన్నాళ్లు కొనసాగుతుందనే అంశంపై కూడా వీరిరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలియవచ్చింది. ‘నీలాంటి వారు బీజేపీలో ఉంటే బాగుంటుంది' అని కావూరి అనగా, ‘నేనింకా ఏమీ నిర్ణయించుకోలేదు. పరిస్థితులు సర్దుకున్నాక ఆలోచిస్తాన'ని చెప్పినట్టు సమాచారం.