మాజీ మహిళా క్రికెటర్ ఆత్మహత్య: జీవితంపై విరక్తితోనే..
విజయవాడ: రంజీ క్రికెట్ మాజీ ప్లేయర్ దుర్గా భవాని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం కలిగించింది. గతంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా చాముండేశ్వరీనాథ్ ఉన్న సమయంలో అతను తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అప్పట్లో ఆరోపణలు చేయడం, ఆ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
జీవితంపై విరక్తితోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దుర్గా భవానీ సూసైడ్ నోట్లో రాసింది. భర్తనూ తల్లినీ ఉద్దేశించి ఆమె సూసైడ్ నోట్ రాసింది. తన మృతిపై విచారణ జరిపించవద్దని ఆమె కోరారు. తన కూతురును జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె వేడుకున్నారు.
అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చాముండేశ్వరీనాథ్పై చేసిన ఫిర్యాదును ఆమె ఉపసంహరించుకుంది. అటువంటి ఘటనలేవీ జరగలేదని చెప్పింది. ఆ తరువాత ఓ వ్యక్తితో దుర్గా భవానికి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈమెకు మూడెళ్ల కుమార్తె ఉంది. పెళ్లైన తరువాత గుణదలలో దుర్గ భవాని సంతోషంగా జీవనం సాగిస్తుండేవారని అంటున్నారు. అయితే ఏ కారణం చేతనో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది.
కొద్దిరోజులుగా దుర్గా భవాని, ఆమె భర్త మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. దుర్గా భవాని ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జగ్గుపిల్లి దుర్గ్భావాని (30) పదేళ్ల క్రితం వన్టౌన్లోని ఎస్కెవిపి స్కూల్లో పిఇటిగా పనిచేశారు. పిఇటిగా పనిచేసే సమయంలో అదే స్కూల్లో పిఇటిగా పనిచేస్తున్న మద్దినేని వెంకట సత్యప్రసాద్ను ప్రేమించి నాలుగేళ్ల క్రితం పెళ్లాడారు. సత్యప్రసాద్కు దుర్గా భవానీ రెండో భార్య. ప్రస్తుతం మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలోని గంగిరెద్దులదిబ్బ యాదవుల బజార్లో కాపురం ఉంటున్నారు.
ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో దుర్గ్భావాని చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో భర్త నూజివీడులో ఉన్నాడు. దుర్గా భవాని సోదరి వరుసైన దుర్గాంబ ఇంటికిరాగా ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించటంతో సోదరుడైన జగ్గుపిల్లి సత్యనారాయణకు ఫోన్లో సమాచారం అందించింది. దీంతో హుటాహుటిన సత్యనారాయణ ఇక్కడకు చేరుకున్నాడు.
మరోవైపు సమాచారం అందుకున్న మాచవరం సిఐ ఉమామహేశ్వరరావు, సెంట్రల్ ఏసిపి ప్రభాకరబాబు, ఎస్ఐ గురుప్రసాద్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుర్గా భవాని ఆత్మహత్య సమాచారం తెలియటంతో పెద్దసంఖ్యలో క్రీడాకారులు, స్థానికులు తరలివచ్చారు. సోదరుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే భర్త మాత్రం ఆదివారం రాత్రి వరకూ అందుబాటులోకి రాలేదు. ఆమె తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయటంలేదు. దుర్గా భవాని ఆత్మహత్య చేసుకోవటానికి ముందు రాసినట్టు భావిస్తున్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మృతదేహానికి సోమవారం పంచనామా, పోస్టుమార్టం నిర్వహించనున్నారు. దీంతో వాస్తవాలు వెలుగు చూస్తాయని క్రీడాభిమానులు భావిస్తున్నారు.