టీడీపీకి కుతూహలమ్మ రాజీనామా - కుమారుడితో సహా : చంద్రబాబు సొంత జిల్లాలో- వైసీపీ కొత్త వ్యూహాలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాల్లో సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేసారు. పార్టీ సీనియర్ ..మాజీ స్పీకర్..మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కుతూహలమ్మతో పాటుగా ఆమె కుమారుడు..ప్రస్తుత టీడీజీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ హరిక్రిష్ణ సైతం పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. కుతూహలమ్మ వైద్యురాలిగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా తన రాజకీయ జీవితం ఆరంభించారు.
గంగాధర నెల్లూరులో టీడీపీకి షాక్
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నేదరుమల్లి జనార్ధనరెడ్డి కేబినెట్ లో వైద్య- ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేసారు. 1994లో కాంగ్రెస్ పార్టీ సీటు నిరాకరించటంతో ఇండిపెండెంట్ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. 2007లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి కుతూహలమ్మ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీలో చేరారు. 2014 లో జీడీ నెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
వైసీపీ వ్యూహంలో భాగమేనా
2014, 2019 ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి ప్రస్తుత డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గెలుస్తూ వచ్చారు. అయితే, కుతూహలమ్మ కుమారుడు హరిక్రిష్ణకు టీడీపీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. కానీ, ఇప్పుడు కుతూహలమ్మతో పాటుగా కుమారుడు హరిక్రిష్ణ సైతం టీడీపీకి రాజీనామా చేసారు. రాజీనామా సమయంలో వారు అందుకు గల కారణాలను వెల్లడించారు. టీడీపీ తమను గౌరవించిందని చెబుతూ.. అనారోగ్యం కారణంగా ప్రజల్లో తిరగలేకపోతున్నామని చెప్పారు.
కుమారుడు తో సహా రాజీనామాతో
ఈ పరిస్థితుల్లో పార్టీకి న్యాయం చేయలేకపోతున్నామని..అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నామని చెబుతూ.. మరో పార్టీలో చేరే ఆలోచన లేదని కుతూహలమ్మతో పాటుగా కుమారుడు హరిక్రిష్ణ సైతం చెప్పుకొచ్చారు. అయితే, జిల్లాలో పూర్తిగా ఆధిపత్యం సాధించేందుకు వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు ఒక్కరే టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక, కొద్ది నెలల క్రితం జరిగిన మున్సిపల్...పంచాయితీ ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఆధిక్యత సాధించింది.
Recommended Video
చిత్తూరు జిల్లాపై వైసీపీ ఫోకస్
ఈ నియోజవకర్గం పైన మంత్రి పెద్దిరెడ్డి..ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బ తీస్తామని చెబుతున్నారు. అయితే, చంద్రబాబు ఈ నెలాఖరులో కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. ఇక, వచ్చే ఎన్నికల కోసం ముందస్తుగానే సిద్దం అవుతున్న వైసీపీ..తమ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ప్రధానంగా చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ..లోక్ సభ స్థానాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పుడు గంగాధర నెల్లూరు లో వైసీపీ తరువాతి అడుగులు ఏంటనేది చూడాల్సి ఉంది.