మాజీ స్పీకర్ కోడెలకు వరుస షాక్లు: కొడుకు , కూతురుపై కేసులు.. నెక్స్ట్ ఎవరు..?
అమరావతి : నవ్యాంధ్ర తొలి స్పీకర్ కోడెల శివప్రసాద్కు కూతురి రూపంలో సెకండ్ షాక్ తగిలింది. గత టీడీపీ హయాంలో కోడెల కూతురు, కుమారుడు శివరామ్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కుమారుడు శివారంపై కేసు నమోదు కాగా .. ఇవాళ కూతురు విజయలక్ష్మీపై కేసు నమోదైంది. ఉద్యోగం ఇప్పిస్తామని, కాంట్రాక్టు అప్పజెప్పుతామని కోట్లు దండుకున్న కోడెల కూతురు, కుమారుడి అవినీతి బయటపెట్టేందుకు మిగతా బాధితులు కూడా సిద్దమవుతున్నారు. బాధితులంతా జట్టుగా ఏర్పడి గుంటూరు ఎస్పీని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కోడెల కూతురు విజయలక్ష్మీ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు.
వెలుగులోకి అరాచకాలు ...
ఏపీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేతగా కోడెల శివప్రసాద్కు మంచి గుర్తింపు ఉంది. తన తండ్రి పేరును కూతురు విజయలక్ష్మీ, కుమారుడు ఎడపెడ వాడుకున్నారు. అధికార దర్పాన్ని ప్రదర్శించి అందినకాడికి దోచుకున్నారు. వీరి హయాంలో జరిగిన దోపిడిని అప్పటి విపక్ష వైసీపీ కే.ఎస్.టీ (కోడెల సర్వీస్ టాక్స్)గా పిలుచుకున్నారు. ఇప్పుడు అధికారం మారడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
కూతురు పేరు ..
కోడెల కూతురు విజయలక్ష్మీ మోసం చేసిందని బాధితురాలు పద్మావతి పోలీసులను ఆశ్రయించారు. గుంటూరులో ఎకరం భూమి తనకు ఉందని ఆమె తెలిపారు. ఆ భూమిపై కన్నుపడ్డ విజయలక్ష్మీ నకిలీ రికార్డులతో బెదిరింపులకు దిగిందని వాపోయారు. భూమి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో .. రూ.15 లక్షలు ఇవ్వాలని కోరితే భయపడి ఇచ్చామని తెలిపారు. కానీ తర్వాత మరో .5 లక్షలు ఇవ్వాలని వేధింపులకు దిగుతుందని నిట్టూర్చారు. తన వద్ద అంత డబ్బులేదని చెప్పిన వినకుండా .. బెదిరిస్తున్నారని ఆరోపించారు. వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించారు పద్మావతి.
మితిమీరిన ఆగడాలు
కోడెల శివప్రసాద్ నరసరావుపేట, సత్తెనపల్లిలో నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో సత్తెనపల్లి నుంచి పోటీచేసి .. స్పీకర్ పదవీ అధిష్టించిన సంగతి తెలిసిందే. ఇక రాజధాని సమీప ప్రాంతం కావడంతో .. కోడెల కూతురు, కుమారుడి ఆగడాలు మితిమీరిపోయాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని, కాంట్రాక్టు పనులు అప్పజెప్పుతామని, అంతేందుకు కేబుల్ వ్యవహారాల్లో కూడా దూరి అందినకాడికి దోచుకున్నారు. వరి పంట కోత తర్వాత గడ్డి స్కాం చేసి కోడెలకు మచ్చ తీసుకొచ్చారు. తన కూతురు, కుమారుడు ఇన్ని చేస్తున్నా మిన్నకుండిపోవడమే కోడెల చేసిన తప్పిదం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అదీ చేస్తాం, ఇదీ చేస్తామని లక్షలు దండుకున్న వారు ... ఒకరికి కూడా పనిచేయలేదు. ఆ సమయంలో అదేంటీ అనే అడిగే ధైర్యం చేయలేదు బాధితులు. ఎందుకంటే అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నందున .. ఆందోళన చేపట్టిన తిరిగి కేసు పెడతారని భయపడ్డారు. వైసీపీ అధికారంలోకి రావడంతో కోడెల కుమారుడు, కూతురు లీలలు బయటకు వస్తున్నాయి.
ధైర్యం చేసిన పద్మావతి ..
తన ఎకరాం భూమి కోసం పద్మావతి బయటకు రావడంతో విజయలక్ష్మీ అరాచకాలు సమాజానికి తెలిసింది. మిగతా వారు కూడా జట్టుగా ఏర్పడి జిల్లా ఎస్పీని ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తాము వివిధ ఉద్యోగాల కోసం ఇచ్చిన నగదు, ఆధారాలను అందజేయనున్నారు. కోడెల కూతురు, కుమారుడు అరాచకాలకు సంబంధించి ఆధారాలను సేకరించి .. పకడ్బందీ కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మొత్తానికి కోడెలకు కూతురి రూపంలో మొదటి షాక్ తగిలింది. ఇక కుమారుడు చేసిన అన్యాయాలకు సంబంధించి త్వరలోనే కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతుల చెప్పినట్టు కే.ఎస్.టీ కింద ఉన్న బాధితులంతా వస్తే కోడెలకు సంబంధించి అవినీతి భాగోతం అంతా వెలుగులోకి వస్తోంది. దీంతోపాటు సత్తెనపల్లిలో కోడెల ఓటువేసేందుకు వెళ్లిన సమయంలో ప్రజాగ్రహం స్పష్టంగా తెలుస్తోంది. ఐదేళ్లు అధికారంలో ఉన్న స్పీకర్పై జనాల్లో అంత కోపానికి కారణం ... వారు చేసిన అవినీతి అని స్పష్టమవుతుంది.