ఆద్యుడు చంద్రబాబే: సాక్ష్యాలున్నాయన్న మాజీ స్పీకర్
అమరావతి: విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ ఖనిజ తవ్వకాలకు 15 ఏళ్ల క్రితమే అప్పటి సీఎం చంద్రబాబు ప్రయత్నించారని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అంతేకాదు తాజా జీవో జారీచేయడానికి 15 నెలల క్రితమే ఆయన రంగం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
చింతపల్లి, పాడేరు ప్రాంతాల పర్యటన ముగించుకుని తిరిగి వెళుతూ ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2000లో సీఎంగా ఉన్న చంద్రబాబు బాక్సైట్ ఖనిజాన్ని దుబాయి కంపెనీకి అప్పట్లోనే యత్నించారన్నారు.
అయితే అప్పట్లో గవర్నర్గా ఉన్న రంగరాజన్ తన విశిష్ట అధికారాలతో ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్నారన్నారు. ఇదే విషయాన్ని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారన్నారు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు విదేశీ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్న విషయం నిజమేనన్నారు.
అయితే తనతో పాటు అప్పటి కేంద్ర మంత్రులు కిషోర్చంద్రదేవ్, జైరాం రమేష్లతో పాటు రాష్ట్ర మంత్రి గువ్వల బాలరాజులు ఏపీలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకున్నామన్నారు. అయితే 2015 ఆగస్టు 17న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ఏ విధంగా పర్యావరణ అనుమతులు మంజూరు చేసిందో అంతుబట్టడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వ తుది అనుమతులకు లోబడే రాష్ట్ర అటవీ శాఖ జీవో నంబరు 97 జారీ చేసిందన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు తిరిగి అధికారం చేపట్టిన వెంటనే బాక్సైట్ ఖనిజ తవ్వకాలకు 2014 ఆగస్టులోనే ప్రయత్నాలు ప్రారంభించారని, ఇందుకు సంబంధించి తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు.
కాలా కమిటీ చేసిన సిఫార్సులకు విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయని, ఆ ఉత్తర్వులు, జీవోలు న్యాయస్థానాల్లో నిలబడవన్నారు. అయితే తాము న్యాయస్థానాల ద్వారా పోరాడదలుచుకోలేదని ప్రజల తరపున నిలబడి ఉద్యమిస్తామన్నారు. త్వరలోనే విశాఖ ఏజెన్సీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.