మూడు రాజధానులపై త్వరలో కాంగ్రెస్ కీలక నిర్ణయం: విశాఖకే నా ఓటు: కేంద్ర మాజీమంత్రి..!
తిరుపతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు స్పష్టం చేశారు. పాలనను గానీ, అభివృద్ధిని గానీ వికేంద్రీకరించడం వల్ల భవిష్యత్ తరాలు బాగు పడతాయని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి మొత్తాన్నీ హైదరాబాద్లో కేంద్రీకరించారని, దీనివల్ల విభజన అనంతరం ఏపీ ఎంతగా నష్టపోయిందనే విషయం గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదని అన్నారు.
మూడు రాజధానులను స్వాగతిస్తున్నా.. వ్యక్తిగతమే
శుక్రవారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలను సమర్పించారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిని వికేంద్రీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉందని చెప్పారు. మూడు రాజధానుల ఏర్పాటు విషయాన్ని తాను స్వాగతిస్తున్నానని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని, అలాంటి ఉదంతాలు పునరావృతం కాకూడదని అన్నారు.
విశాఖ.. ది బెస్ట్..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల మూడు ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, తీర ప్రాంతం, ఓడరేవు వంటి అనుకూల వనరులు ఉన్నంతున.. విశాఖపట్నం మంచి రాజదాని అవుతుందని పల్లంరాజు అభిప్రాయపడ్డారు. పరిపాలనాను కొనసాగించడానికి విశాఖను మించిన మరో అనుకూల నగరం లేదనీ చెప్పారు. విభజన తరువాత 16 వేల కోట్ల రూపాయలకు పైగా ఆర్థికలోటులో ఏర్పడిన నవ్యాంధ్ర ప్రయోజనాలనుఅప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్ద రాజకీయాల కోసం బలి చేశారని విమర్శించారు.
తలకుమించిన పనులు..
వేల కోట్ల రూపాయల మేర ఆర్థికలోటు ఉన్నప్పటికీ..భారీ ప్రాజెక్టులను చేపట్టారని, ఫలితంగా- లోటు కొనసాగిందని అన్నారు. ఆర్థిక స్థితిగతులు ఎలాంటివనే విషయం తెలిసినప్పటికీ.. చంద్రబాబుకు ఆడంబరాలకు పోయారని ధ్వజమెత్తారు. అప్పట్లోనే అమరావతికి బదులుగా విశాఖ నుంచి పరిపాలన సాగించి ఉంటే బాగుండేదని అన్నారు. ఇదివరకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ సిఫారసులను చంద్రబాబు పట్టించుకోలేదని, ఈ కమిటీ సిఫారసులను కాదని రాజధానిపై చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
మండలి రద్దు విషయం కొత్తేమీ కాదు..
శాసన మండలి రద్దు విషయంపై పల్లంరాజు స్పందిస్తూ.. ఇదివరకు తెలుగుదేశం పార్టీ వారే మండలిని రద్దు చేశారని అన్నారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శాసన మండలిని రద్దు చేశారని, ఆ తరువాత.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాన్ని పునరుద్ధరించారని అన్నారు. శాసన మండలి అనేది రాష్ట్రాల వెసలుబాటును చూసుకుని ఏర్పాటు చేసుకున్నవే కావడం వల్ల దాన్ని రద్దు చేయడమా? కొనసాగించడమా? అనేది ప్రభావం చూపబోదని అన్నారు.