వైసీపీనుంచి పోటీ చేసిన కోట్ల బీజేపీలో చేరారు: టీడీపీపై పురంధేశ్వరి నిప్పులు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సోమవారం అన్నారు. అవినీతిరహిత పాలన కోరుకునే వారంతా బీజేపీలోకి రావాలని, అలా చేరడం మంచి పరిణామం అని ఆమె అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ వైసీపీ నేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి పార్టీ అధినేత వైయస్ జగన్కు షాకిస్తూ బీజేపీలో చేరారు.
ఆయనకు పురంధేశ్వరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. కేవలం కండువాలు వేసుకోవడమే కాకుండా కేంద్రం నవ్యాంధ్ర ప్రదేశ్కు చేస్తున్న మేలును ప్రజలలోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆమె వ్యాఖ్యానించారు. 2014లో ఎలాగైతే దేశంలో ఓ మంచి మార్పు కావాలని ప్రజలు ఆకాంక్షించారో, ఇప్పుడు ఏపీలోను అదే కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
నాడు దేశంలో, నేడు ఏపీలో మార్పు కోరుకుంటున్నారు
నాడు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే బీజేపీకి ఆశీర్వదించి, ఘనమైన విజయం అందించారని పురంధేశ్వరి చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోను ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలన, ఓ దృఢమైన పాలన, సుస్థిర పాలనను కోరుకుంటున్నారని తెలిపారు.
Recommended Video
అందుకే బీజేపీలోకి నేతలు
ఏపీలోనూ మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో దానిని బేరీజు వేసుకొని, రాష్ట్రంలో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తే దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి మంచి పాలనను అందించే సామర్థ్యం బీజేపీకి ఉందని గ్రహించిన పలువురు నేతలు ఈ రోజు తమ పార్టీలోకి చేరడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. ఏపీలో బీజేపీ బలోపేతం కావడం ఖాయమన్నారు.
పార్టీలో చేరే వారికి ఓ విజ్ఞప్తి
పార్టీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలకు తాను ఓ విజ్ఞప్తి చేస్తున్నానని, కండువా వేసుకోవడంతో పాటు బృహత్తర బాధ్యతను మీరు మీ భుజస్కందాలపై మోసి కేంద్రం చేస్తున్న వాటిని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. ఎందుకంటే ఏపీలో బీజేపీపై తీవ్రమైన దుష్ప్రచారం జరుగుతోందన్నారు. ఏపీలో పేరుగాంచిన, మన రాష్ట్రానికి దిశానిర్దేశనం చేసిన కోట్ల కుటుంబం నుంచి ఓ నేత తమ పార్టీలోకి రావడం శుభపరిణామం అన్నారు. మోడీ చేస్తున్న మంచి పనులు చూసి ఆయన పార్టీలో చేరారన్నారు.
దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీపై ఆగ్రహం
గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ అండగా ఉంటున్నప్పటికీ, కేంద్రం నుంచి ఏమాత్రం సహాయం అందటం లేదని, ఇక్కడ అభివృద్ధికి విఘాతంగా బీజేపీ ఉందని కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీని ఉద్దేశించి మండిపడ్డారు. దానిని మనం సమర్థవంతంగా తిప్పికొడుతూ, ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలందరికీ చెప్పాలన్నారు.
వైసీపీ నుంచి పోటీ చేసిన కోట్ల హరిచక్రపాణిరెడ్డి
కాగా, కోట్ల హరిచక్రపాణి రెడ్డి 2014లో కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీకి దూరం పాటిస్తూ వచ్చారు. ఈ మధ్యే మళ్లీ యాక్టివ్ అయ్యారు. అనుచరులతో సమావేశమై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఏపీలో మరికొందరు నేతలు బీజేపీలో చేరడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కోట్ల విజయభాస్కర రెడ్డి కుటుంబం నుంచి ఒకరు తమ పార్టీలో చేరడం అంటే ఏపీలో తమ పార్టీ మెరుగవుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు.