నిధి నిక్షేపాల కోసం చెన్నంపల్లి కోటలో తవ్వకాలు...ప్రభుత్వమే అనుమతిచ్చింది..
కర్నూలు: నిధి నిక్షేపాలు ఉంటాయా...బంగారం...వజ్రాలు...వైఢూర్యాలు రాసులు పోసి ఉంటాయా...అనంత పద్మనాభుని దేవాలయంలో అలాంటి అపార సంపద బైటపడటంతో ఆ సందేహాలు పటాపంచలయిపోయాయి...ఇప్పుడు అలాంటి అపార సంపద కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తోంది. అదెక్కడంటే....
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని చెన్నంపల్లి కోటలో నిధి నిక్షేపాలు ఉన్నాయని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. దీంతో ప్రభుత్వం వజ్రాలు, బంగారు నిక్షేపాల అన్వేషణలో భాగంగా ఈ కోటలో తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 102.54 ఎకరాల్లో విస్తరించివున్న చెన్నంపల్లి కోటలో బంగారు, వజ్రాల గనుల తవ్వకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అపోహలకు తావులేకుండా ఉండేందుకు గాను చెన్నంపల్లి గ్రామ కమిటీ, పోలీసుల సమక్షంలో తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో ఎయిర్ పైపులైన్ ద్వారా కోటలోని బండరాళ్లను రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు తొలగిస్తున్నారు. ఈ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెన్నంపల్లి కోట వద్దకు చేరుకుంటున్నారు.