జగన్తో దూరం పెరుగుతోందా తరుగుతోందా.. టాలీవుడ్ మౌనం వెనక అసలేం జరుగుతోంది..!
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ సోమవారం రోజున డాక్టర్స్ డే సందర్భంగా 1088 కొత్త 104, 108 అంబులెన్స్లను ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో ఆరోగ్యరంగానికి పెద్ద పీట వేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపట్ల అన్ని రంగాల ప్రముఖలు ప్రశంసించారు. జాతీయ స్థాయిలో నేతలు పలువురు జాతీయ మీడియా జర్నలిస్టులు ముఖ్యమంత్రి జగన్పై ప్రశంసలు కురిపించారు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రశంసించారు. సాధారణంగా ఏపీ ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం మంచి పనులు చేస్తే దానికి మద్దతు తెలుపుతూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్ చేయడమో లేదా నేరుగా ఒక ప్రకటన ద్వారా తమ మద్దతును తెలపడమో చేస్తారు. కానీ అబులెన్స్ల ప్రారంభం సందర్భంగా కొందరు తప్ప ఇక టాలీవుడ్ పెద్దలు ఎవరూ ట్వీట్ కానీ ఇతర మాధ్యమాల ద్వారా కానీ తమ మద్దతు తెలపకపోవడం చర్చనీయాంశమైంది.
అంబులెన్స్ ప్రారంభోత్సవంపై అభినందనలు తెలపని టాలీవుడ్
ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ను కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో కొందరు ఇండస్ట్రీ పెద్దలు కలవడం జరిగింది. లాక్డౌన్ పై ఆంక్షలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సినిమా షూటింగులకు అనుమతులు కోరేందుకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారు. జగన్ కూడా సినీ పెద్దల వినతికి సానుకూలంగానే స్పందించారు. ఇది పక్కనపెడితే జూలై 1న దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1088 కొత్త అంబులెన్స్లను ప్రారంభించింది. దీనిపై జాతీయ మీడియా కూడా కథనాలను ప్రచురించింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ మంచి పనిచేసిన ముందుండి ప్రశంసించే టాలీవుడ్ పెద్దలు ఈ బృహత్తర కార్యక్రమంపై నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది.
అసంతృప్తితో ఉన్న ఫ్యాన్స్
తెలంగాణ ప్రభుత్వంకు ఎప్పుడూ అండగా ఉండే టాలీవుడ్ ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా ప్రశంసించింది. పలువురు టాలీవుడు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచారు. అయితే సంజీవనిగా ఉండే ఈ అంబులెన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒకరిద్దరు సెలిబ్రిటీలు తప్ప టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకునే వారు ఎలాంటి ప్రశంసలు లేదా అభినందనలు తెలపకపోవడంపై ఆ సెలబ్రిటీల అభిమానులే అసంతృప్తితో ఉన్నారు. సినిమా షూటింగుల కోసం అనుమతి కోరేందుకు హైదరాబాదు నుంచి అమరావతికి వచ్చిన చిరంజీవి, రాజమౌళి, సురేష్ బాబు, నాగార్జున ఇతర ప్రముఖులు ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన అంబులెన్స్ విషయంలో ఒక్కరు కూడా అభినందనలు తెలపకపోవడాన్ని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
జగన్ ప్రభుత్వాన్ని అభినందించిన పూరీ
ఇక సీఎం జగన్, ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశారు. ప్రపంచ కరోనావైరస్పై పోరాడుతుండగా, ప్రతి మండలానికి అంబులెన్స్ ఉండాలన్న మంచి ఆలోచన చేసిన సీఎం జగన్కు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశారు. అత్యవసర సమయాల్లో, ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో , విపత్తులు, వచ్చిన సమయాల్లో ఈ అంబులెన్స్ల సేవలు ఎంతో ఉపయోగకరమని పూరీ ట్వీట్ చేశారు.
ప్రశంసలు కురిపించిన తమన్ కోనా వెంకట్
ఇక ప్రముఖ సంగీత దర్శకులు తమన్ కూడా స్పందించాడు. ఈ అంబులెన్స్లు ఈ సమయంలో చాలా అవసరమని, దేవుడు మరింతగా ఆశీర్వదించాలని చెబుతూ తమన్ ట్వీట్ చేశాడు. ఏపీ సీఎం జగన్ ప్రారంభించిన ఈ అంబులెన్స్కు సంబంధించిన ఫోటోలను ట్విటర్లో పోస్టు చేశాడు. ఇక రచయిత కోనా వెంకట్ కూడా తన స్పందన తెలిపాడు. ఆరోగ్యరంగం పట్ల ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ప్రశంసించారు. అంతేకాదు జగన్ ట్వీట్ చేసిన పోస్టును కోనా రీట్వీట్ చేశారు.